Manchu Family: నోరుంది కదాని ఎక్కడపడితే అక్కడ, ఎవరిపై పడితే వారిపై వాడేస్తే.. ఆ తర్వాత నోటితీట తీరిపోతుంది. అసలే మంచు ఫ్యామిలీ. ఆ కుటుంబానికి నోరే పెద్ద మైనస్. మోహన్బాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు. టాలీవుడ్లో చాలామందికి దూరమయ్యారు. మంచు విష్ణు కాస్త పొగరుగా ఉంటారు. ‘మా’ ప్రెసిడెంట్గా గెలిచినా.. సోషల్ మీడియా మాత్రం ఆయనతో ఆటాడుకుంది. ఇక మంచు లక్ష్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె.. ఆమె మాటలు.. అంతా అదో టైప్. మొత్తంగా మంచు ఫ్యామిలీ ట్రోలర్స్కు మంచి ముడిసరుకు.
మంచు ఫ్యామిలీలో మనోజ్ ఒక్కరే కాస్త బెటర్ అనిపించేవారు. అందుకే, మనోజ్పై ట్రోల్స్ తక్కువే. మెగా అభిమానులు సైతం మనోజ్ విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఉంటారు. కానీ, మేమంతా ఒక్కటే అనేలా లేటెస్ట్గా మంచు మనోజ్ సైతం తన నోటి దురుసుతనాన్ని బయటపెట్టుకున్నారు. అదికూడా మీడియాపైన.
తిరుపతిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చారు తండ్రీకొడుకులు మోహన్బాబు అండ్ మనోజ్. వాళ్లు కనిపిస్తే ఈ సమయంలో ఎవరైనా అడిగే ప్రశ్న ఒక్కటే.. మీ ఫ్యామిలీ వివాదం ఏమైందని? విష్ణు, మనోజ్ల గొడవ సద్దుమనిగిందా అని. మీడియా ప్రతినిధులు సైతం ఇదే విషయం అడిగారు. అంతే. అంతమాత్రానికే మోహన్బాబు బుస్సు మన్నారు. ‘మీ ఇంట్లో నీ భార్యకు, నీకూ సంబంధం ఏంటో చెప్పగలవా’ అంటూ ఆ ప్రశ్న అడిగిన విలేకరిని ఎదురు ప్రశ్నించారు.
ఆ తర్వాత మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చాడు. ఆయనా ఎకసెక్కాలు చేశాడు. మేమంతా ఇంతే అన్నట్టు తండ్రిలానే మాట్లాడాడు. అన్నదమ్ముల వివాదంపై ప్రశ్నిస్తూ.. ‘రీసెంట్ ఇష్యూస్పై క్లారిటీ ఇస్తే బాగుంటుంది’ అని ఓ రిపోర్టర్ చాలా పొలైట్గా ప్రశ్న అడిగాడు. కానీ, మనోజ్ తిక్కతిక్కగా ఆన్సర్ ఇచ్చాడు. ‘భుజంపై సెగగడ్డ వచ్చింది. ఇదే రీసెంట్ ఇష్యూ. వచ్చి గోకుతారా’ అంటూ నోటిదురద ప్రదర్శించాడు. సెటైర్ వేయడమే కాకుండా.. వ్యంగ్యంగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.
మీరు మీరు కొట్టుకుంటారు.. ఆ వీడియోను మీరే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు.. ఆ విషయం ఏమైంది అని ప్రశ్నిస్తే మాత్రం ఇలా బలుపు చూపుస్తారా? అంటూ మంచు కుటుంబం తీరుపై మీడియా ప్రతినిధులే కాదు.. సామాన్యులూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా మరోసారి స్నో ఫ్యామిలీతో ఆటాడుకుంటోంది. వాళ్లంతే.. వాళ్లు మారరు.. అంటూ మండిపడుతున్నారంతా.