Telangana Latest News : మతం మనిషికి మత్తుమందులాంటిదన్న జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ మాటలు అక్షరసత్యమని మరోసారి రుజువైంది. మతం మనిషిని ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది. కొంతమంది చేసే తప్పుడు, కనికట్టు ప్రచారాలు ఎంతటి విజ్ఞానవంతుడినైనా అవివేకిని చేస్తాయి. మత బోధనల పేరిట జరుగుతున్న చిత్రాలు.. మనిషిలోని విజ్ఞతను చంపేస్తుంది. ఇదేదో మలయాళీ సినిమా ‘ట్రాన్స్’ గురించి విశ్లేషణ కాదు. మనం చూస్తున్న, మన మధ్య జరుగుతున్న ఓ అభూత కల్పనకు సాక్ష్యం.
పాస్టర్ ప్రవీణ్. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో ఇతడికి కల్వరి టెంపుల్ పేరుతో ఓ చర్చి ఉంది. చర్చి నిర్వాహకుడైన ప్రవీణ్.. తెలుగు రాష్ట్రాల్లో మత బోధనలు చెబుతుంటారు. అనేక సభల్లో భక్తుల మానసిన, శారీరక సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరిస్తుంటాడు.
కళ్లు లేని వాళ్లకు కళ్లు, అవయవాలు లేని వాళ్లకు అవయవాలు తెప్పించే సంఘటనలు పాస్టర్ ప్రవీణ్ ప్రార్థనాసభల్లో నిత్యకృత్యాలు. ఆయన ద్వారా అవయవాలనే కాదు ప్రాణాలను కూడా తిరిగి పొందినట్లు సభల్లో బాధితులు చెప్పడం కూడా కనిపిస్తుంటుంది. వీటన్నింటినీ తనకున్న యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా ప్రపంచానికి పరిచయం చేశాడు పాస్టర్ ప్రవీణ్.
మత ప్రార్థనలు సామాన్యుల మెదడుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో అంచనా వేయడం కష్టమైన పనే. చివరికి చనిపోయిన వాళ్లనూ బతికిస్తారని మత ప్రబోధకులు చెప్పే మాటలు కూడా నమ్మేవాళ్లున్నారు. మలయాళీ చిత్రం ‘ట్రాన్స్’లోనూ సరిగ్గా ఇలాంటి సీన్ ఒకటుంటుంది. అందులో తన బిడ్డ అనారోగ్యానికి గురైతే.. ఆస్పత్రి అవసరం లేదని.. చనిపోయినా మత ప్రబోధకుడు బతికిస్తాడని ఓ తండ్రి నమ్మకంతో ఉంటాడు. కానీ చివరికి కుమార్తెను పోగొట్టుకుంటాడు.
ట్రాన్స్ సినిమాలోని ఘటనే మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. యూట్యూబ్ లో పాస్టర్ ప్రవీణ్ ను ఫాలో అయిన రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి అంబులెన్స్లో తన తల్లి శవాన్ని పెట్టుకుని చర్చి వద్దకు వచ్చాడు. పాస్టర్ బతికిస్తారని.. ప్రార్థనలు చేయించాలని పట్టుబట్టాడు. అయితే ఆ చర్చి సిబ్బంది లోపలికి వెళ్లనీయలేదు. పాస్టర్ ప్రవీణ్ కూడా బయటకు రాలేదు. అయినా పాస్టర్ ప్రవీణ్ కోసం తల్లి మృతదేహంతో 4 గంటలపాటు అక్కడే నిరీక్షించాడు.
సోషల్ మీడియాల్లో తాను ప్రవీణ్ మహిమల గురించి చూశానని చెప్పాడు. దీంతో తన తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చానన్నాడు. ఎంతవేచి చూసినా ప్రవీణ్ చర్చికి రాలేదు. అక్కడి సిబ్బంది వెళ్లిపోవాలనడంతో మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్లో తిరుగుప్రయాణమయ్యాడు.
తల్లి శవాన్ని చర్చి వద్దకు తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఇంజనీరింగ్ చేశాడు. అంత చదువుకుని మూఢనమ్మకాలతో శవాన్ని తీసుకువచ్చి తిరిగి బతుకుతుందని చెప్పడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.