Patancheru : ఇస్నాపూర్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను కాపురానికి పంపట్లేదన్న కోపంతో అత్తపై కత్తితో దాడి చేశాడు. దాడి చేస్తుండగా అడ్డు వచ్చిన భార్యపై కూడా అదే కత్తితో దాడి చేసి.. గొంతు కోశాడు. ఈ సంఘటనలో అత్త మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లోని పద్మారావు కాలనీలో ఉండే శాంతమ్మ(40) తన కుమార్తె సత్యవతి(22)ని రుద్రవరానికి చెందిన సాయిబాబా (26)కు ఇచ్చి వివాహం జరిపించింది. ఇటీవల దంపతుల మధ్య గొడవలు కావడంతో సత్యవతి పుట్టింటికి వెళ్లింది. రోజులు గడుస్తున్నా సత్యవతి తిరిగి కాపురానికి రాలేదు. తన భార్య సత్యవతిని అమె తల్లి శాంతమ్మే కాపురానికి పంపడం లేదని సాయిబాబా కోపం పెంచుకున్నాడు. భార్యకోసం అత్తగారింటికి వెళ్లినట్లే వెళ్లి.. శాంతమ్మను కత్తితో పొడిచి చంపాడు. అడ్డొచ్చిన భార్య గొంతు కోశాడు.
అనంతరం సాయిబాబా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న సత్యవతిని, అమె తల్లి శాంతమ్మను స్థానికులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శాంతమ్మ మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం సత్యవతికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.