Mallikarjun Kharge : బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలంతా కలిసి పనిచేస్తేనే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బూత్స్థాయి కన్వీనర్ల సదస్సు(Booth Level Agents Meeting)లో పాల్గొన్న ఖర్గే.. రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయన్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తలే బలమని స్పష్టంచేశారు. కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా ఈడీ, సీబీఐ దాడులు జరిగే అవకాశముందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దేశంలో నిరుద్యోం, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని ఖర్గే అన్నారు. ప్రధాని మోదీ గతంలో ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తామన్నారని కానీ అలా చేయలేదని మండిపడ్డారు. మోదీకి రైతుల బాధలు, కష్టాలు తెలియవన్నారు. సమస్యలు పరిష్కరించ కుండా పక్కదారి పట్టిస్తారని విమర్శించారు. పాకిస్థాన్, చైనా, దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారంటూ మోదీపై ఖర్గే ఘాటు విమర్శలు చేశారు.
తెలంగాణలో 6 గ్యారంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశామని ఖర్గే తెలిపారు. త్వరలోనే మరో రెండు గ్యారంటీలను చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు దేశానికి ఆదర్శం కావాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. అందుకే బీఆర్ఎస్, బీజేపీలను ఓడిద్దామని పిలుపునిచ్చారు.
ప్రజలకు న్యాయం చేయడం కోసమే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారని ఖర్గే తెలిపారు. మోదీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని సూచించారు. దేశాన్ని అప్పుల్లో ముంచారని ఆరోపించారు. ప్రభుత్వ ఖర్చుతో ప్రధాని ప్రచారం చేసుస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీజేపీ పాలనలో వ్యవస్థలను నిర్వీర్యమయ్యాయని తెలిపారు. మణిపుర్ అగ్నిగుండంలా మారిన విషయాన్ని ప్రస్తావించారు. వేలాది మంది చనిపోతే ఒక్కసారి కూడా మోదీ ఆ రాష్ట్రానికి వెళ్లలేదన్నారు.