దేశ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే ఇందుకు స్పష్టమైన సంకేతమన్నారు.హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్య నేతలతో జరుగుతున్న సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలు, విభేదాలను పక్కన పెట్టి.. పార్టీ విజయం కోసం కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంస్థాగత ఐక్యత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఐక్యత, క్రమశిక్షణ ద్వారా మాత్రమే ఎదుటి పార్టీలను ఓడించగలమని తేల్చిచెప్పారు.
గత పదేళ్లలో బీజేపీ పాలనలో సామాన్య ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయని ఖర్గే విమర్శించారు.పేదలు,రైతులు,కార్మికులు,మహిళలు,యువత సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రధాని ఆత్మవిమర్శ చేసుకోవడంలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరూ ఏకమై నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై 2024 నాటికి శతాబ్దం పూర్తవుతుందని తెలిపారు. అదే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే మహాత్ముడికి సరైన నివాళి అని చెప్పారు.
భవిష్యత్తులో అనేక సవాళ్లు ఎదురవుతాయని ఖర్గే తెలిపారు. భారత ప్రజాస్వామ్య మనుగడ, రాజ్యాంగ పరిరక్షణకు ముప్పు పొంచి ఉందన్నారు. త్వరలో5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల సమయం మాత్రమే ఉందన్నారు. జమ్మూ- కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కొత్త విధానాలకు శ్రీకారం చుట్టాయని తెలిపారు. ఆ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచించారు.
సరికొత్త బలం, స్పష్టమైన సందేశంతో తెలంగాణలో ముందుకెళ్తామని ఖర్గే స్పష్టం చేశారు. దేశంంలో బీజేపీ దుష్టపాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని దృఢ నిబద్ధతతో హైదరాబాద్ నుంచి బయల్దేరతామన్నారు. రెండురోజులపాటు జరిగిన cwc మీటింగ్ లో కాంగ్రెస్ నేతలు దిగిన గ్రూప్ ఫోటో ఆసక్తిగా ఉంది.