Mallareddy IT Raids : తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటు 65 గ్రూపులుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన కుమారుడు, అల్లుడు, బంధువులు ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలపై దాడులు నిర్వహించారు. దాదాపు 400 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఐటీ సోదాల్లో 10 కోట్లకుపైగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఒక్క మల్లారెడ్డి అల్లుడి ఇంట్లోనే మూడు కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం.
మరోవైపు ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి బోయిన్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇష్టానుసారం వ్యవహరించారని ఫిర్యాదులో వెల్లడించారు. ఇదిలా ఉంటే..ఐటీ అధికారులు కూడా మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదుతో పీఎస్ వద్ద కొద్దిసేపు హైడ్రామా నడిచింది. మల్లారెడ్డి అల్లుడు మల్లిఖార్జున్ రెడ్డి ఇంట్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయన టర్కీ నుంచి హైదరాబాద్ రానున్నారు.
మల్లారెడ్డి విద్యా సంస్థల్లో అక్రమాలు గుర్తించినట్లుగా ఐటీ అధికారులు నిర్ధారణకొచ్చారు. నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వసూలు చేసిన ఫీజులను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులగా పెట్టినట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో బ్లాక్ లో నగదును తీస్తున్నట్లు తెలిపారు. నగదు మొత్తాన్ని నారాయణ ఆస్పత్రులకు తరలించినట్లుగా ఐటీ తెలిపింది. మల్లారెడ్డి తన ఆస్తులను తక్కువ చేసి చూపించారని నిర్ధారించారు. సొసైటీ కింద పన్ను రాయితీ పొందిన నారాయణ సంస్థలు…రాయితీలు ఉన్నప్పటికీ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఐటీ నిర్ధారణకొచ్చింది. సోదాలు ముగిసిన అనంతరం మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చారు. సోమవారం తన ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు.
మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డిని ఐటీ అధికారులు బ్యాంక్ కు తీసుకెళ్లారు. కోఠిలోని స్టేట్ బ్యాంక్ కు తీసుకువెళ్లారు. అక్కడ మొత్తం 12 లాకర్లను గుర్తించి..ఎనిమిదింటిని తెరిచి చూసినట్లు తెలిసింది.
ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు రాయించుకున్నారని చెప్పారు. నకిలీ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని మండిపడ్డారు.
వంద కోట్లు డోనేషన్లు తీసుకున్నట్లు బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. ల్యాప్ టాప్, ఫోన్ అధికారులు మర్చిపోతే…తానే స్వయంగా పంపించానని అంటున్నారు. తన కొడుకుతో కూడా బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు