Malla Reddy: దూద్ వాలా మల్లన్న మినిస్టర్ అయ్యారు. మొదట్లో బోయిన్ పల్లిలో పాల వ్యాపారం చేసేవారు మల్లారెడ్డి. ఆ తర్వాత రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషనల్ బిజినెస్.. అలా అలా అపర కుబేరుడిగా ఎదిగారు. మేడ్చల్ బిగ్ బుల్ గా మారారు.
మల్లారెడ్డి మామూలోడు కాదు. అత్యంత ధనవంతుడు. మేడ్చల్ జిల్లా ఏరియాలో వేల ఎకరాల భూములు ఉన్నాయి. వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అంతేనా ఇంకా చాలా ఉంది.
అనేక విద్యా సంస్థలు ఆయన ఆర్థిక వనరులు. మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీనే ఉందంటే మాటలా. స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కళాశాలలు ఆయన సొంతం. ఆయా కాలేజీల్లో మేనేజ్ మెంట్ సీట్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కోట్లకు సీట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భూకబ్జా ఫిర్యాదులకైతే లెక్కేలేదు.
మల్లారెడ్డి ఆస్తులు, అవినీతిపై గతంలో రేవంత్ రెడ్డి ఐటీ, ఈడీకి ఫిర్యాదు చేశారు. పలు ఆధారాలను జాతీయ దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు. అయినా, నో యాక్షన్. అప్పట్లో రేవంత్ రెడ్డి కంప్లైంట్స్ ను ఈడీ, ఐటీ అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం మల్లారెడ్డి టార్గెట్ గా ఐటీ విస్తృతంగా దాడులు చేస్తోంది. ఏకకాలంలో 50 బృందాలు.. గంటల తరబడి తనిఖీలు చేస్తున్నాయంటే ఎంత పెద్ద ఎత్తున సమాచారం లభించి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదంతా రేవంత్ రెడ్డి అప్పట్లో అందించిన సమాచారం మేరకే ప్రస్తుతం ఈ సోదాలు జరుగుతున్నాయని అంటున్నారు.
మల్లారెడ్డి, ఆయన ఇద్దరు కుమారుల ఇళ్లు, కూతురు-అల్లుడు ఇల్లు, తమ్ముడి ఇల్లు, దగ్గరి బంధువుల ఇళ్లలో ముమ్మర సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి విద్యాసంస్థల కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. పలు చోట్ల కోట్లకు కోట్లు డబ్బు సీజ్ చేశారు. మల్లారెడ్డి ఆర్థిక వనరులపై పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. బినామీ పేర్ల మీద కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.
పాల వ్యాపారం నుంచి విద్యా వ్యాపారం వరకూ ఎదగడం తప్పుకాదు కానీ.. ఆ సంపాదించిన సొమ్మంతా సక్రమమేనా? ఆ మొత్తానికి పన్ను కట్టారా? మేనేజ్ మెంట్ కోటా సీట్లను అక్రమంగా అమ్ముకున్నారా? భూకబ్జాలకు పాల్పడ్డారా? ఇలా అనేక అంశాలపై ఐటీ అధికారులే కాదు.. మేడ్చల్ వాసులూ ఆసక్తి కనబరుస్తున్నారు.