Revanth Reddy: రేవంత్రెడ్డి. ఇప్పుడైతే టీపీసీసీ చీఫ్. కానీ, ఆయన పొలిటికల్ ఎంట్రీ నుంచే డైనమిక్ లీడర్. తెలుగు రాష్ట్రాల్లో రేవంత్రెడ్డికి స్పెషల్ ఇమేజ్. ఊరూరా రేవంత్ ఫ్యాన్స్ ఉంటారు. పక్కా మాస్ లీడర్. మాటలు మంట రేపుతాయి. డైలాగులు తూటాల్లా దాడి చేస్తాయి. చిచ్చరపులిలా చెలరేగడం ఆయన నైజం. అందుకే, టైగర్ రేవంతన్న అని పిలుచుకుంటారు అభిమానులు. అలాంటి పులిని చూసి ఇప్పుడు కొందరు లీడర్లు వాతలు పెట్టుకుంటున్నారని అంటున్నారు. రేవంత్రెడ్డికి పోటీగా పలువురు సీనియర్లు పోటాపోటీ పాదయాత్ర చేస్తుండటం కాంగ్రెస్ శ్రేణులను కన్ఫ్యూజ్ చేస్తోంది. సోషల్ మీడియాలో గ్రూపులుగా విడిపోయి.. డైలాగ్ వార్ నడిపిస్తున్నారు.
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు. మిగతా కమలం పార్టీ లీడర్లంతా ఆయనకు మద్దతుగా నిలిచారు. కానీ, కాంగ్రెస్లో అలా కాదు. హాత్ సే హాత్ జోడో యాత్రతో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పాదయాత్రతో దూసుకుపోతున్నారు. ఆయన అడుగు పెట్టిన చోటల్లా.. భారీ ప్రజాదరణ కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై, స్థానిక నేతలపై వీర లెవెల్లో మాటల దాడి చేస్తున్నారు. రాళ్ల దాడి జరిగినా.. అదరక, బెదరక.. తగ్గేదేలే అంటూ సమరోత్సాహం చూపిస్తున్నారు. రేవంత్రెడ్డి యాత్ర ఇంతగా సక్సెస్ అవుతుంటే.. కాంగ్రెస్లో మునుపెన్నడూ లేని జోష్ కనిపిస్తుంటే.. కొందరు సీనియర్లు మాత్రం రేవంత్కు పోటీగా పాదయాత్రలకు సిద్ధమయ్యారు.
రేవంత్రెడ్డి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అన్నట్టు.. సీనియర్ నేత మహేశ్వర్రెడ్డి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు పాదయాత్ర స్టార్ట్ చేశారు. అటు, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం నల్గొండలో పాదయాత్రకు ప్లాన్ చేశారు. ఇలా ఎవరికి వారే.. నడుచుకుంటూ పోతే.. పార్టీ ముందుకు సాగుతుందా? పార్టీలోనే ఐకమత్యం లేదనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లదా? అని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు.
రేవంత్రెడ్డి పాదయాత్ర తన సొంతానికేం చేయట్లేదు. అది అధిష్టానం నిర్దేశించిన కార్యక్రమం. పీసీసీ చీఫ్గా ఆ బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు. కానీ, పాదయాత్రతో రేవంత్ ఇమేజ్ మరింత పెరుగుతుందనే భయాందోళనలతోనే అన్నట్టుగా.. సీనియర్లు పోటీ యాత్రలు చేపట్టారని కేడర్ మండిపడుతోంది.
రేవంత్రెడ్డి పాదయాత్రకు పార్టీ ఇంఛార్జ్ మాణిక్రావ్ థాక్రే పలుమార్లు హాజరయ్యారు. సీతక్క అయితే రేవంత్ వెంటే ఉంటోంది. వీహెచ్, భట్టి, షబ్బీర్ అలీ, మల్లు లాంటి సీనియర్లు అటెండ్ అయ్యారు. కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, మహేశ్వర్ రెడ్డిలాంటి వాళ్లు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పైగా, పోటీ పాదయాత్రలు చేస్తుండటం కాంగ్రెస్ను కలవర పెడుతోంది.
అయితే, ఈ వాదనను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగా ఖండిస్తున్నారు. కాంగ్రెస్ లో ఎవరు పాదయాత్ర చేసినా అది హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగమేనని అన్నారు. మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చేసే పాదయాత్రలో తప్పు లేదంటూ స్వాగతించారు. యాత్ర చేయని నేతలపై పార్టీ పరంగా చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. హైకమాండ్ గైడ్ లైన్స్ ప్రకారమే నేతలంగా పాదయాత్రలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ గా నిలిచారు.