Maheshwar Reddy : నిర్మల్ లో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్, 220 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టి 5 రోజులు కావడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆదివారం అర్ధరాత్రి తర్వాత మహేశ్వర్రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
తొలుత మహేశ్వర్రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ షుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్యులు గుర్తించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి.. నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోనూ ఆయనకు మళ్లీ పరీక్షలు నిర్వహించారు. హై మైగ్రేన్ ఉందని గుర్తించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇందుకోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు తెలిపారు.
నిర్మల్ ఆస్పత్రికి చేరుకున్న మహేశ్వర్రెడ్డి కుటుంబ సభ్యులు వైద్యులతో చర్చించారు. మహేశ్వర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ తరలించేందుకు అడ్డు చెప్పారు . నిర్మల్ ఆస్పత్రిలోనే వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు దీక్ష భగ్నంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మహేశ్వర్రెడ్డి. అర్ధరాత్రి దాటాక దొంగచాటున దీక్షను భగ్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు మహేశ్వర్రెడ్డి.
అంతకుముందు మహేశ్వర్రెడ్డి నిరాహార దీక్షకు సంఘీభావంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. నిరసనలు ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నిర్మల్కు వెళ్లనున్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మహేశ్వర్రెడ్డిని పరామర్శించనున్నారు.