తెలంగాణ కాంగ్రెస్ కొత్త పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల వారీగా పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశాలకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షి, సహ ఇంచార్జ్లు విశ్వనాథం, విష్ణునాథ్లు హాజరవుతున్నారు. డీసీసీ అధ్యక్షులు, మంత్రులు, జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్ లు, మాజీ మాజీలు, ఫ్రంటల్ చైర్మన్లు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి రోజు మూడు ఉమ్మడి జిల్లాల చొప్పున సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశాల్లో ప్రధానంగా.. పలు అంశాలను ఏజెండాగా పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం పై పీసీసీ అధ్యక్షుడు ఫోకస్ పెట్టారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందుకోసం కొత్త కార్యవర్గం విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ మారిన నేపథ్యంలో.. కార్యవర్గం విషయంలో కూడా అవసరమైన చోట మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో మెజారిటీ స్థానాలు గెలుపొందే దిశగా పార్టీ నేతలందరూ కలిసి పని చేయాలని దిశా నిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమీక్ష సమావేశాల్లో చర్చించనున్నారు.
Also Read: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!
ఈ సమీక్షా సమావేశంలో అతి ముఖ్యంగా పార్టీ నేతలకు కీలక విషయాన్ని నిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పి కొట్టాలనే దానిపై నేతలను గైడ్ చేస్తారంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అవుతున్నారని ఆ లోటు తీర్చేలా అందర్నీ యాక్టివ్ చేయనున్నారు.
రుణమాఫీ తో పాటు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రత్యేకంగా బ్రీఫ్ చేయనున్నారు. రుణమాఫీ విషయంలో ప్రజల్లో నెలకొన్న గందరగోళాల పై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలపై ప్రజల్లో చర్చ పెట్టే విధంగా సమీక్షా సమావేశంలో నిర్ణయించనున్నారు. మొత్తం మీద పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మొట్ట మొదటి సమీక్షా సమావేశాలు కావడంతో.. పార్టీ నేతల్లో కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది.