Telangana New PCC Chief Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్గా ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ను నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ చీఫ్తో పాటు పశ్చిమ బెంగాల్కు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, కేరళకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామకానికి ఆమోదం తెలుపుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతకం కూడా చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏ క్షణమైనా రావొచ్చని సమాచారం.
తెలంగాణ పీసీసీ అధ్యక్ష నియామకంపై గత రెండు నెలలుగా కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వివిధ సామాజిక కోణాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఢిల్లీలో ప్రత్యేకంగా చర్చించారు. ఈ చర్చలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ పదవిని కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చారు.
అయితే బీసీ సామాజిక వర్గం నుంచి ఈ పదవికి మధుయాష్కీ గౌడ్ కూడా పోటీపడడంతో ఆలస్యం జరిగిందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ పదవికి మహేశ్ కుమార్ గౌడ్తో పాటు మధుయాష్కీ గౌడ్ పోటీ పడగా..కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ మహేశ్ కుమార్ గౌడ్ ను ఖరారు చేసినట్లు సమాచారం.
Also Read: తెలంగాణకు రెడ్ అలర్ట్.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
కాగా, 1966 ఫిబ్రవరి 24వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం రహత్ నగర్లో మహేశ్ కుమార్ గౌడ్ జన్మించారు. ఈయన ఈ ఏడాది ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.