Kothagudem : కొత్తగూడెంలోని హౌజింగ్ బోర్డు. పట్టపగలు.. పట్టణం నడి మధ్యలో.. అందరూ చూస్తుండగానే దారుణ ఘటన జరిగింది. కారులో వెళ్తున్న ఓ యువ జంటపై గుర్తుతెలియని వ్యక్తులు విరుచుకుపడ్డారు. భర్తను చితకబాది.. భార్యను కిడ్నాప్ చేశారు. ఘటనలో బయటపడ్డ షాకింగ్ నిజం అందరినీ విస్తుగొలుపుతోంది. ఆ యువతి తల్లిదండ్రులే కిడ్నాప్ చేయించినట్టు తెలుస్తోంది. కొత్తగూడెంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
ఖమ్మంకు చెందిన సన్నీ, కొత్తగూడెంకు చెందిన మాధవి.. ఆరు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. కొత్త జంట ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. గురువారం కొత్తగూడెంలోని కాలేజీలో పరీక్ష రాసేందుకు సన్నీతో కలసి మాధవి కారులో వచ్చింది. కారు హౌజింగ్ బోర్డు వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఆటోలో వచ్చారు. ఆటో అడ్డుపెట్టి కారును ఆపారు. సన్నీని చితకబాది.. మాధవిని కిడ్నాప్ చేశారు.
దాడి, కిడ్నాప్ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి. ఘటన జరిగిన తీరు అందరినీ షాక్కు గురి చేస్తోంది. సన్నీ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నామని.. ప్రేమ, పెళ్లి కోణంలోనే ఎంక్వయిరీ చేస్తున్నట్టు డీఎస్పీ వెల్లడించారు.