Hanmaonda Accident: హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట శివారు రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన లారీ.. కారును ఢీకొంది. ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన వీరంతా.. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిథికి గురువారం రాత్రి కారులో బయల్దేరారు. పెంచికల్ పేట వల్ల ఎదురుగా వస్తోన్న లారీ అదుపుతప్పి వీరి కారును ఢీ కొట్టింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు రేణుక, భార్గవ్, శ్రీదేవిలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులను.. మంతెన కాంతయ్య(72), శంకర్ (68), భరత్(29), మంతెన చందన(16)గా గుర్తించారు. మృతులు ములుగు జిల్లా ఏటూరునాగారంకు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై రాజ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.