lookout notice on sahil alias rahil
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్టలో ర్యాష్ డ్రైవింగ్ చేసిన సోహెల్ ముంబైకి పారిపోయాడు. అక్కడి నుంచి దుబాయికి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. సోహెల్ ను రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మూడురోజుల క్రితం(డిసెంబర్ 23) బెంగపేట ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాద ఘటనలో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడైన సాహిల్ అలియాస్ రాహిల్ ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. ముగ్గురు యువతులను కారులో ఎక్కించుకుని అతివేగంతో కారు నడుపుతూ.. ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ బారికేడ్లను బలంగా ఢీ కొట్టాడు సాహిల్. ఇందులో నిర్లక్ష్యం వహించారని గుర్తించిన పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గారావును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేసును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
తాజాగా ఈ కేసులో మరో కోణం వెలుగుచూసింది. యాక్సిడెంట్ జరగ్గానే సాహిల్ దుబాయ్ లో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తండ్రి సూచనతో అనుచరులు సాహిల్ ను తప్పించి.. ఆదివారం తెల్లవారుజామున పనిమనిషైన అబ్దుల్ ఆసిఫ్ (27)ను పంజాగుట్ట పీఎస్ కు తీసుకెళ్లి.. అతడే కారు నడిపినట్లు చెప్పించారు. పోలీసులు తొలుత అబ్దుల్ ఆసిఫ్ పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గురు యువతుల్ని పీఎస్ కు పిలిపించి వాంగ్మూలం తీసుకున్నపుడు కారు నడిపింది సాహిల్ గా నిర్థారించారు. ఘటనా స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, బేగంపేట, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో సాహిల్ అసలు నిందితుడని గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. నేరాన్ని తనమీద వేసుకున్న అబ్దుల్ ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని వెల్లడించారు.