Loan App Harassment(TS news updates): పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా.. లోన్ యాప్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ఆన్ లైన్ లో సాగుతున్న దందాలకు.. అమాయకులు బలవుతున్నారు. మనుషుల అవసరాలే పెట్టుబడిగా.. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో బీటెక్ స్టూడెంట్.. ఈ లోన్ యాప్ ల మాయావలలో చిక్కుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చిన్నవయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
నెల్లికుదురు మండలం వావిలాల శివారు కొండెంగలగుట్ట తండాకు చెందిన 22 ఏళ్ల బానోత్ ఆకాశ్.. హైదరాబాద్ లోని నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. తన అవసరాల కోసం.. కొన్ని నెలల క్రితం లోన్ యాప్ ను సంప్రదించాడు. ఆన్ లైన్ లోనే 30 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పును సకాలంలో తిరిగి చెల్లించకపోవడతో.. నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరిగింది. డబ్బు కట్టాల్సిందే అని బెదిరింపులకు దిగారు. దీంతో నిర్వాహకుల వేధింపులకు భయపడ్డ ఆకాశ్.. విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. పొదుపు సంఘంలో రుణం తీసుకుని.. లోన్ యాప్ కు కట్టేద్దామని భరోసా కూడా ఇచ్చారు.
అయినా యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి తగ్గలేదు. అప్పు కట్టేందుకు గడువు కోరినా.. ఆగలేదు. కంటిన్యూగా కాల్స్ చేసిన వేధిస్తూనే ఉన్నారు. రికవరీ ఏజెంట్ల ఒత్తడి భరించలేని ఆకాశ్.. సొంతూరికి వచ్చాడు. ఇంట్లో అందరూ నిద్రిస్తున్న వేళ.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. నెల్లికుదురు ఎస్సై క్రాంతి కిరణ్.. కేసు నమోదు చేశారు.