Nalgonda : సాధించాలనే తపనకు.. పట్టుదల తోడైతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని నిరూపించాడా బాలుడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే.. అద్భుతాన్ని సృష్టించాడు. ప్రయాణంలో బస్సు ఎక్కడానికి వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు పడుతున్న అవస్థలు గమనించి.. అందుకు ఓ పరిష్కార మార్గాన్ని కనుగొన్నాడు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అజయ్ అనే బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. అయితే బస్సు ఎక్కే సమయంలో వృద్దులు, గర్భిణీలు, కాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి ఇబ్బందులను అజయ్ గమనించాడు. వారు సులువుగా బస్సు ఎక్కేలా ఓ పరికరాన్ని తయారు చేయాలనే ఆలోచనకు వచ్చాడు. ఆలోచన వచ్చిందే తడవుగా తాను పాఠశాలలో విన్న ఓ పాఠాన్ని మననం చేసుకుంటూ థర్మాకోల్, సిరంజీలు, పైపులతో అజయ్ ఆ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ శ్రీవిద్య సహకారంతో పాస్కల్ డివైస్ ప్రోటో టైపును రూపొందించాడు.
పాస్కల్ సూత్రం (Pascal’s principle) ఆధారంగా హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే ఒక ప్లాట్ ఫామ్ (platform)ను రూపొందించాడు. దీనికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టం డ్రైవర్ దగ్గర ఉంచాడు. డ్రైవర్ దగ్గరున్న లీవర్ ను ఉపయోగించినట్లయితే ప్లాట్ ఫామ్ డోర్ దగ్గర నేలపైకి వస్తుంది. ప్లాట్ ఫామ్ మీదికి ప్రయాణికులు ఎక్కిన తర్వాత లీవర్ ను లాగితే ప్లాట్ ఫామ్ మెల్లగా పైకి లేవడంతో.. ప్రయాణికులు నేరుగా బస్సులోనికి చేరుకోవచ్చు. దీనితో వారు పడుతున్న ఇబ్బందులు తొలిగిపోతాయి.
తాను తమ పాఠశాల అధ్యాపకుల సహకారంతో ఈ పరికరాన్ని రూపొందించ గలిగానని అజయ్ అన్నాడు. ఫిజిక్స్ టీచర్ బోధించిన పాస్కల్ సూత్రం ఆధారంగా తనవద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులతో సిరంజీలు, పైపులు, థర్మాకోల్ కొనుగోలు చేసి వాటిని ఉపయోగించి తయారు చేసిన ఈ పరికరం అందరి మన్ననలు పొందడం తనకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తోందని అజయ్ చెప్పాడు. తనకు ఎవరైనా సహకారమందిస్తే నిజమైన హైడ్రాలిక్ సిస్టంతో ఈ మిషన్ ను తయారు చేయగలనని అజయ్ ఎంతో నమ్మకంగా చెపుతున్నాడు.
తమ విద్యార్థి అజయ్ తనకున్న ఐడియాతో ఈ పరికరాన్ని రూపొందించడం ఎంతో గర్వంగా ఉందని మాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజిక్స్ టీచర్ శ్రీవిద్య అన్నారు. ప్రతి విద్యార్థి కేవలం చదువు కాకుండా తమకొచ్చిన ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని ఆమె అన్నారు.
అజయ్ రూపొందించిన ఈ పరికరం సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ కు ఎంపికైంది.