వాసాలమర్రికి ఇప్పుడు కావాల్సిందేంటి? కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? తలకిందులైన ఆశలు ఇప్పుడు చిగురిస్తాయా? కొత్త ప్రభుత్వం హామీల అమలుతోనైనా వాసాలమర్రి వాసుల బాధలు తొలగిపోతాయా? కేసీఆర్ సర్కార్ దిగిపోవడంతో ఊపిరిపీల్చుకున్నామని వాసాలమర్రి గ్రామస్తులు అంటున్నారంటే ఇప్పుడు వారు ఎంత రిలాక్స్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.
వాసాలమర్రి గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1763 మంది ఉన్నారు. వీళ్లలో షెడ్యూల్ కులాల వారు 249 మంది, షెడ్యూల్ తెగల వారు 128 మంది ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. 2020 నవంబర్ 1 దత్తత ప్రకటన చేసిన సీఎం కేసీఆర్.. 2021 జూన్ 22న మొదటిసారి వాసాలమర్రికి వెళ్లారు. హామీల అమలు కోసం ఎదురు చూసి చూసి.. కొందరైతే ఆశలు కూడా వదిలేసుకున్నారు. ఈ ఊళ్లో చాలా మంది వృద్ధులకు పెన్షన్లు కూడా లేవు. కనీసం రేషన్ కార్డులు, పింఛన్లు ఇచ్చి ఆదుకోలేకపోయారు. కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఇల్లు కట్టుకునే వారు కూడా ఎటూ కాకుండా పోయారంటున్నారు. అంతని ఇంతని చెప్పి ఒడ్డున పడ్డాడని మండిపడుతున్నారు.
వాసాలమర్రిని కేసీఆర్ దత్తత తీసుకొని ఏండ్లు గడిచాయి తప్ప పని జరగలేదు. కానీ, ఆయన ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. దీంతో వాసాలమర్రి వాసుల ఆశలు తలకిందులయ్యాయి. యాదాద్రి నుంచి ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్ కు ఫాస్ట్ గా వెళ్లడానికి ఉపయోగపడుతుందని రోడ్డు వేశారు. అది కూడా పూర్తికాలేదు. రోడ్డు వేసేటప్పుడు ఊరి దగ్గరున్న పొలాలకూ నష్టం వాటిల్లింది. అప్పట్లో రైతులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు. కనీసం ఊళ్లో రోడ్లు కూడా సరిగా లేవు. అసలు వాసాల మర్రి పరిస్థితే బాగా లేదు.
వాసాలమర్రిలో అప్పట్లో బీడీ కార్మికులకు పింఛన్లు, కొందరికి రేషన్ కార్డులు ఇచ్చారు. అంగన్వాడీ సెంటర్లు, హెల్త్ సెంటర్ సహా ప్రైమరీ, హైస్కూల్ టెండర్లు ఖరారై నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో గ్రామానికి వచ్చిన అప్పటి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.. పునర్నిర్మాణం కోసం టెండర్లు వేస్తామని ప్రకటించారు. టెండర్లు రాలేదు. ఏ పనీ స్టార్ట్ కాలేదు. దీంతో వాసాలమర్రిలో ఎలాంటి మార్పు రాలేదు. అవే ఇరుకు రోడ్లు, అవే పెంకుటిండ్లు, మారని రోడ్లు. ఇంతే. కరెంట్ స్థంభాలు లేవు, డ్రైనేజీలు సరిగా లేవు. ఊళ్లో సీసీ రోడ్లు లేవు. మెయిన్ రోడ్ కు 130 గజాలు తీసుకుని ఒక్క గజం పైసలు మాత్రమే ఇచ్చారంటున్నారు. నమ్మించి మోసం చేశారని ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ పై వాసాలమర్రి వాసులు ఫైర్ అవుతున్నారు.
2022 మే 10న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు. మోడల్ విలేజ్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ప్రజల అభిప్రాయాలు స్వీకరించకుండా గ్రామసభలో తీర్మానాన్ని ఏ విధంగా ప్రవేశ పెడతారని ముందు గ్రామ పునర్నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మోడల్ విలేజ్ తీర్మానం చేపట్టాలని పట్టుబట్టగా అధికారులు గ్రామసభను రద్దు చేసి వెళ్లిపోయారు. అంతే ఇక వెనక్కి రాలేదు. వాసాలమర్రిలో ఆగవ్వ గురించి తెలియని వారు లేరు. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ సభలో ఆగవ్వ తన ఫ్రెండ్ అని కూడా మాట్లాడారు. వారికి చాలా హామీలిచ్చి వెళ్లి ఇప్పుడు రోడ్డున పడేశారంటున్నారు ఆగవ్వ భర్త. ఉండడానికి ఇప్పుడు ఇల్లే లేదంటున్నారు.
గ్రామంలో 494 ఇండ్లు ఉండగా వీటిలో 100కు పైగా పక్కా ఇళ్లు ఉన్నాయి. మిగతావన్నీ పెంకుటిల్లు.. సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ రోడ్డు కొరకు ఇళ్లు పడగొట్టాడానికే మాస్టర్ ప్లాన్ నాటకం రూపొందించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దత్తత తీసుకుని మౌలిక వసతులు కల్పిస్తాననే హామీ నీళ్ల మూటగా మారిందని మండిపడుతున్నారు.
టెండర్లు వేయకపోవడం తమ మంచికే జరిగిందని వాసాలమర్రి వాసులు అంటున్నారు. టెండర్లు వేసి ఇండ్లు కూలగొట్టి ఉంటే తమ పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. ఇళ్లు పూర్తయ్యే నాటికి టెంట్ల కింద గోసపడాల్సి వచ్చేదన్నారు. కాంగ్రెస్ వారు.. ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షలు ఇస్తామంటున్నారని, అదే జరిగితే ఎవరి జాగాలో వాళ్లు ఇండ్లు కట్టుకుంటామంటున్నారు. పాత ఇండ్లు కూలగొట్టి కొత్తవి కట్టేదాకా ఎక్కడ ఉండాలని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ పై నమ్మకం లేకనే పాతవి కూలగొట్టుకోలేదంటున్నారు.
కేసీఆర్ నమ్మించి మోసం చేయడంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అక్కడి ఓటర్లు ఆదరించలేదు. నవంబర్ 30న జరిగిన పోలింగ్ లో గ్రామంలో1376 ఓట్లకుగాను 1258 ఓట్లు పోలయ్యాయి. వాటిలో సగం మంది కూడా బీఆర్ఎస్ కు ఓటు వేయలేదు. అదీ పరిస్థితి. ఎర్రవల్లిలోని ఫాంహౌజ్ కు వెళ్లేందుకే కేసీఆర్ రోడ్డు వేసుకున్నారు. అందుకోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలను బలవంతంగా తొలగించారు.
ఏదో అనుకుంటే తమ గ్రామాన్ని ఇలా కేసీఆర్ కోలుకోలేకుండా దెబ్బతీస్తారని ఊహించలేదని వాపోతున్నారు వాసాలమర్రి వాసులు.