Serilingampalle : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని సిద్ధిక్ నగర్ లో పింకీ అనే ఎనిమిది నెలల గర్భిణిని హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ కూకట్ పల్లిలోని ఆరవ సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. దోషులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.
2018 జనవరి 27న రాత్రి పింకీ ఇంట్లో ఉండగా బీహార్ కు చెందిన మమత, వికాస్, అమర్ కాంత్, అనిల్ అనే వ్యక్తులు పింకీ వద్దకు వెళ్లి గొడవపడ్డారు. అక్రమ సంబంధం నేపథ్యంలో వీరి మధ్య గొడవ వివాదాస్పదంగా మారింది. దీంతో నలుగురు వ్యక్తులు పింకీ పై దాడికి పాల్పడ్డారు. చేతులు, కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
పింకీ మృతదేహాన్ని కటింగ్ మిషన్ తో ఏడు ముక్కలుగా చేశారు. శరీర భాగాలను గోనెసంచుల్లో మూట కట్టి బొటానికల్ గార్డెన్లోని పాలపిట్టల సైకిల్ పార్క్ వద్ద పడేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున గోనె సంచులను పరిశీలించిన వాకర్స్ గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. పింకీ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా పైన పేర్కొన్న నలుగురు వ్యక్తులు పింకీని చంపి.. ముక్కలు చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసును విచారించిన న్యాయమూర్తి పావని.. నలుగురు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించారు.