Left Parties : తెలంగాణలో వామపక్షాలు తమ ఉనికిని కోల్పోయాయి. బీఆర్ఎస్ తో స్నేహం వికటించడంతో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. మునుగోడు బై ఎలక్షన్ లో వామపక్షాలతో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో వామపక్షాలకు కేసీఆర్ మొండి చేయి చూపించారు. దీంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి వామపక్షాలు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకుంది. సీపీఎం మాత్రం తమకు అడిగిన స్థానాలు ఇవ్వలేదని దూరంగా ఉంది. ఈ తరుణంలో సీపీఐ కొత్తగూడెం స్థానాన్ని కైవశం చేసుకుంది. దీంతో పాటు ఒక ఎమ్మెల్సీ పదవిని పొత్తులో భాగంగా పొందనుంది. దీంతో రాష్ట్రంలో సీపీఐ పార్టీ తన ఉనికిని చాటుకుంది. కొత్తగూడెంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. కూనంనేని 2009లోనూ ఎమ్మెల్యేగా కొత్తగూడెం నుంచి ప్రాతినిధ్యం వహించారు.
రాష్ట్రంలో సీపీఎం తన ఉనికిని కోల్పోయింది. ఒకప్పుడు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బలంగా ఉన్న సీపీఎం.. ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పాలేరు నుంచి పోటీ చేసిన తమ్మినేనికి ఐదు వేల ఓట్లు కూడా రాకపోవడంతో డిపాజిట్ కోల్పోయారు. మిర్యాలగూడ నుంచి పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డికి సైతం డిపాజిట్ రాలేదు. తమ్మినేని, జూలకంటి గతంలో ఎమ్మెల్యేలుగా పని చేశారు. అలాంటి వారికి డిపాజిట్ రాకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. తమ్మినేని సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఒక సారి ఖమ్మం ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం సీపీఎం ఉనికి రాష్ట్రంలో లేకుండా పోయింది.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరనప్పటికీ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కాంగ్రెస్ ఓటు వేయాలని, బీజేపీని ఓడించాలని ప్రచారం చేశారు. సీపీఎం పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ కు ఓటు వేశారు ఆ పార్టీ శ్రేణులు. కేసీఆర్ పై కోపంతో.. బీజేపీ విధానాలతో విభేదించి, ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఒకప్పుడు బలమైన కేడర్ ఉన్న వామపక్షాలు ఇప్పుడు ఎందుకు డీలా పడ్డాయన్నదే అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది.