Farmhouse Case: ఫాంహౌజ్ కేసులో సిట్ దూకుడు కొనసాగుతోంది. బండి సంజయ్ అనుచరుడైన అడ్వకేట్ శ్రీనివాస్ ను రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించింది. మరోవైపు, ముగ్గురు నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ స్పెషల్ కోర్టును ఆశ్రయించింది సిట్.
రెండు రోజులుగా న్యాయవాది శ్రీనివాస్ ను ఎంతగా ప్రశ్నించినా ఆయన ఒకే ఆన్సర్ చెప్పినట్టు తెలుస్తోంది. బండి సంజయ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. గతంలో తనకోసం పూజలు చేసిన సింహయాజులపై ఉన్న అభిమానంతోనే ఆయనకు విమాన టికెట్ బుక్ చేశానని.. రాజకీయ కోణం ఏమీ లేదని చెప్పారు.
విచారణ తర్వాత శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. బీజేపీతో గానీ, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎప్పుడు పిలిచినా వస్తానని.. సిట్ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
మరోవైపు, ఫాంహౌజ్ కేసులోు ముగ్గురు నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, ఎవరెవరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే నిందితులను రెండ్రోజులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించినప్పటికీ సరైన సమాచారం రాలేదని.. అందుకే మరో వారం రోజులు కస్టడీకి అనుమతించాలని కోరారు. పిటిషన్ పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఏసీబీ స్పెషల్ కోర్టు.