Weather Report: జూన్ నెల ముగుస్తున్నా.. వాన చినుకు జాడలేదు. నైరుతి రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. వానలు కురవాల్సిన సమయంలో నిప్పులు కురుస్తున్నాయ్. ఏకంగా 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయ్. మే నెల కంటే ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయ్. దీంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు.
ఈ నెల 8న ప్రవేశించిన మృగశిర కార్తె చివరి దశకు చేరుకుంది. ఈ కార్తెలో సహజంగానే తొలకరి జల్లులు వ్యవసాయ రంగాన్ని పలకరించాల్సిఉండగా నైరుతి రుతుపవనాలు ఇందుకు గండికొట్టాయి. మరో రెండు రోజుల్లో మృగశిర ముగిసి ఆరుద్ర కార్తె ప్రవేశించనుంది. ఆరుద్ర కార్తె సహజంగానే మంచి వర్షాలతో వాతావరణం రైతులకు అన్ని విధాలుగా అనుకూలించాల్సి ఉంది. అయితే బిపోర్జోయ్ రూపంలో అరేబియా సముద్రం నుంచి పుట్టుకొచ్చిన తుపాన్ రుతుపవనాల వేగాన్ని స్తంబింపచేసింది.
కోటి ఆశలతో ఏరువాకను ఎంతో ఉత్సాహంగా సాగించిన రైతులు వానజాడ లేకపోవటంతో ఉస్సూరు మంటున్నారు. మే నెలలో అక్కడక్కడా వేసిన పత్తి విత్తనాలు కూడా మొలకెత్తకుండానే ఎండిపోయాయి. అక్కడక్కడా కొద్దిపాటి పదునుతో వేసిన పత్తి పైరు కూడా ఎండల ధాటికి వాడిపోయింది.
దుక్కులు దున్ని విత్తనాలు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్న రైతులు చినుకు జాడ కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దేశంలోకి వారం ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు నెమ్మదిగా కదులుతున్నాయి. కేరళ, కర్ణాటకలో విస్తరించిన నైరుతి.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడం లేదు.
మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతవారణ శాఖ అంచనా వేసింది. చాలా ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు పగటిపూట ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు సూచించారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులు మరో వారం పొడిగించింది. ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 12న రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ, ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17 వరకు ఒంటిపూట బడులు జరపాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఎండలు తగ్గకపోవడంతో తాజాగా పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. అటు తెలంగాణలోనూ ఒంటిపూట బడులు నిర్వహించాలన డిమాండ్లు వినిపిస్తున్నాయ్.