TSPSC: పేపర్ లీక్ అవడంతో ఏఈ పరీక్ష రద్దు చేస్తూ.. టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని.. తేదీ ప్రకటిస్తామని తెలిపింది. 837 అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి గాను మార్చి 5న ఏఈ పరీక్ష జరిగింది. 55వేల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు. అయితే, ఏఈ పరీక్ష పేపర్ను కమిషన్ ఉద్యోగి ప్రవీణ్ లీక్ చేసి.. 10 లక్షలకు రేణుకకు అమ్ముకోవడం.. ఆమె మరికొంత మంది నుంచి డబ్బులు వసూలు చేసి పేపర్ ఇవ్వడం.. సిట్ విచారణలో పేపర్ లీక్పై పక్కా ఆధారాలు లభించడంతో.. పోలీస్ నివేదిక ఆధారంగా ఏఈ పరీక్ష రద్దు చేస్తూ TSPSC నిర్ణయం తీసుకుంది.
అంతకుముందు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఏఈ ప్రశ్నపత్రం లీక్పై అధికారులు గురువారం టీఎస్పీఎస్సీకి నివేదిక ఇవ్వనున్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో బుధవారం 2గంటల పాటు విచారణ జరిపిన సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ కీలక ఆధారాలు సేకరించారు. కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి, ఛైర్మన్, కార్యదర్శి కంప్యూటర్లను పరిశీలించారు. ఛైర్మన్, కార్యదర్శి పేషీల్లో సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. సాంకేతిక నిపుణుల నుంచి టీఎస్పీఎస్సీ సర్వర్ల వివరాలు సేకరించారు. ఐపీ అడ్రస్, యూజర్ ఐడీ, పాస్వర్డ్లను, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ నుంచి వివరాలను ప్రవీణ్ దొంగిలించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్తో ఎక్కువగా ఎవరెవరు కలిసి ఉంటారనే విషయాలపై సిట్ ఆరా తీసినట్టు సమాచారం.
కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్ను ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ మరమ్మతు చేశాడు. ఆ సమయంలో డైనమిక్ ఐపీ అడ్రస్కు బదులు తనకు అనుకూలంగా స్టాటిక్ ఐపీ పెట్టాడు. రాజశేఖర్ సాయంతోనే ప్రవీణ్ ప్రశ్నపత్రాలను పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రశ్నపత్రాలను.. రేణుక, ఆమె భర్త డాక్యాకు రూ.10లక్షలకు ప్రవీణ్ విక్రయించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. నిందితుడు ప్రవీణ్ బ్యాంకు ఖాతాలను కూడా సిట్ అధికారులు పరిశీలించారు. రేణుక ఇచ్చిన 10 లక్షలు ఎస్బీఐ ఖాతాలో జమ చేసుకున్న ప్రవీణ్.. ఆ తర్వాత అందులోనుంచి మూడున్నర లక్షలు రాజమహేంద్రవరంలో ఉన్న తన బాబాయ్ ఖాతాకు బదిలీ చేశాడు. ఇప్పటికే బేగంబజార్ పోలీసులు సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలను సిట్ అధికారులు తీసుకున్నారు. ఏఈ ప్రశ్నపత్రంతో పాటు టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ప్రశ్నపత్రాల లీకేజీ గురించి కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. గురువారం కల్లా ప్రాథమిక నివేదికను ఇచ్చేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇక, ప్రధాన నిందితుడు ప్రవీణ్ విషయంలో రోజుకొక కొత్తకోణం వెలుగులోకి వస్తుంది. అమ్మాయిలతో ప్రవీణ్ న్యూడ్ వీడియోలు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 46 మంది మహిళలతో ప్రవీణ్ న్యూడ్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. వీళ్లకి కూడా పేపర్ లీక్ చేసిట్లుగా పోలీసులు గుర్తించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్తో పాటు రేణుక సెలవుల విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి మండలం బుద్దారం ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్గా రేణుక పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఆమె 12 సెలవులు పెట్టినట్లు గుర్తించారు.. ఈ నెల 4,5 తేదీల్లో తమ బంధువు మృతి చెందాడని సెలవు పెట్టారు. ఆ తేదీల్లోనే పేపర్ లీక్ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రతి పరీక్ష ముందు రేణుక సెలవులు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మరోవైపు టీఎస్పీఎస్సీ తీరుపై రాజకీయ, ప్రజాసంఘాల ఆందోళన బాటపట్టాయి. టీఎస్పీఎస్సీ తీరును వ్యతిరేకిస్తూ.. విద్యార్థి సంఘాలు టీఎస్పీఎస్సీ భవన్ను ముట్టడించాయి. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీంతో వారందర్నీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.