Falaknuma Express fire accident reason(Telugu flash news): రైలు ప్రమాద ఘటనతో దక్షిణ మధ్య రైల్వే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాలాసోర్ ఘటనతో అప్రమత్తంగా వ్యవహిరిస్తున్నప్పటికీ.. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ మంటల్లో కాలిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో మూడు బోగీలు పూర్తిగా కాలిపోగా.. మరో నాలుగు బోగీలు పాక్షికంగా కాలిపోయాయి. ట్రైన్కు మొత్తం 19 బోగీలు ఉన్నాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఉదయం వేళ ప్రమాదం జరగడం వల్ల పెను ముప్పు తప్పింది. రాత్రి పూట ఈ దారుణం జరిగి ఉంటే.. పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు.
ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్, యాదాద్రి కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లారు. అగ్ని ప్రమాదం జరిగిన బోగీలను పరిశీలించారు. పెద్దఎత్తున ఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. మంటలు వ్యాపించిన బోగీల లింక్ తప్పించారు. మిగతా బోగీలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. కాలిన బోగీలను అక్కడే వదిలేసి.. మిగతా బోగీలతో ట్రైన్ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు తరలించారు. సురక్షితంగా స్టేషన్కు చేరుకున్న ప్యాసింజర్లు అంతా.. జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకొని హడలిపోతున్నారు. తాము ప్రాణాలతో బతికిపోయినా.. తమ వెంట తెచ్చుకున్న లగేజ్ అంతా కాలి బూడిదై పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైలు దిగిన ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్నారు రైల్వే అధికారులు.
ఓ ప్రయాణీకుడు.. చార్జింగ్ పాయింట్ దగ్గర సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం జరిగిందని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే చైన్ లాగి రైలును ఆపడం వల్ల.. మంటలు మరిన్ని బోగీలకు విస్తరించకుండా అడ్డుకోగలిగారు.
ప్రమాదంతో ఇతర రైళ్ల ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. నడికుడి, రేపల్లెలో పలు రైళ్లను నిలిపివేశారు. కొన్ని ట్రైన్లను విజయవాడ మీదుగా మళ్లించారు. 2 రైళ్లను రద్దు చేయగా మరో 2 రైళ్లను రూట్ డైవర్ట్ చేశారు. జన్మభూమి, నర్సాపూర్ ట్రైన్స్ను విజయవాడ మీదుగా నడిపిస్తున్నారు.
అయితే, ప్రమాదంపై ముందే హెచ్చరిస్తూ.. ఓ వ్యక్తి ఇటీవల లేఖ రాసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. బాలాసోర్ తరహాలోనే.. హైదరాబాద్-ఢిల్లీ రూట్లో మరో రైలు ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందంటూ లేఖలో రాశాడు అగంతకుడు. ఆ లేఖను రైల్వే ఉన్నతాధికారులు ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచారు. ఇప్పుడు ఫలక్నుమా రైలు దగ్థంతో ఆ లేఖ హాట్ టాపిక్గా మారింది. లెటర్కు, ప్రస్తుత ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని రైల్వే అధికారులు చెబుతున్నప్పటికీ.. అనుమానాలు మాత్రం వీడలేదు. లేఖ రాసిన వ్యక్తి బీహెచ్ఈఎల్కు చెందిన వాడిగా గుర్తించి.. అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.