Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏకంగా సీఎం కేజ్రీవాలే టార్గెట్ అయ్యారు. విచారణకు రావాలంటూ ముఖ్యమంత్రికే నోటీసులు ఇచ్చింది సీబీఐ. కొత్త లిక్కర్ పాలసీపై ప్రశ్నించనుంది. తనకు నోటీసులు ఇవ్వడంపై కేజ్రీవాల్ ఫైర్ అవుతున్నారు. అసలు లిక్కర్ స్కాం అనేదే లేదు.. అలాంటప్పుడు కేసు ఎలా పెడతారంటూ మండిపడుతున్నారు.
కేంద్రం కావాలనే ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. 4 వందలకు పైగా దాడులు చేసినా.. ఒక్క పైసా కనిపించలేదని.. అయినా ఆప్ నేతలను ఒక్కొక్కరిని ఇరికిస్తున్నారని తప్పుబట్టారు. కొత్త లిక్కర్ పాలసీ వల్ల 50 శాతం ఆదాయం పెరిగిందని చెప్పారు ఢిల్లీ సీఎం.
కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టులకు అబద్ధాలు చెబుతున్నాయని కేజ్రీవాల్ విమర్శించారు. తాను వంద కోట్లు లంచం తీసుకున్నట్లు ED, CBI ఆరోపించిందని.. తాను మోదీకి వెయ్యి కోట్లు ఇచ్చానని చెబితే సీబీఐ నమ్ముతుందా? అని ప్రశ్నించారు.
మరోవైపు, కేజ్రీవాల్, కవితను కార్నర్ చేస్తూ తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి 5 పేజీల లేఖ రిలీజ్ చేశాడు. తీహార్ క్లబ్కు కేజ్రీవాల్, కవితలకు స్వాగతం అంటూ సెటైర్లు వేశారు. కేజ్రీవాల్ తర్వాత మీవంతే అంటూ కవితకు వార్నింగ్ ఇచ్చాడు. కవిత ఫోన్ నెంబర్లతో కూడిన స్క్రీన్షాట్స్ విడుదల చేశాడు సుఖేశ్. త్వరలోనే కేజ్రీవాల్తో చేసిన చాటింగ్ కూడా రిలీజ్ చేస్తానని లేఖలో తెలిపాడు. తనను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు అర్థరహితమన్నాడు. వచ్చే ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేస్తానని వెల్లడించాడు సుఖేశ్ చంద్రశేఖర్.
ఇక సుఖేశ్కు తెలుగు ఎలా తెలుసు అంటూ బీఆర్ఎస్ వ్యక్తం చేసిన అనుమానాలపైనా స్పందించాడు సుఖేశ్. తన మాతృభాష తెలుగు, తమిళం అని.. ఇంట్లో ఈ రెండు భాషలూ మాట్లాడుతామంటూ క్లారిటీ ఇచ్చాడు.
తన దగ్గర మొత్తం 703 వాట్సాప్ చాట్స్ ఉన్నాయని.. అందులో కేవలం రెండు మాత్రమే విడుదల చేశానని చెప్పాడు. వాట్సాప్ చాట్ మాత్రమే కాదు.. ఇంకా తన దగ్గర ఆడియో, వీడియో, ఫోటోలు కూడా ఉన్నాయంటూ బాంబు పేల్చాడు సుఖేశ్ చంద్రశేఖర్.