Telangana News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ , బీజేపీ నేతలు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు.వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నాగేశ్వర్ రావు భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ములుగు జిల్లా వెంకట పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మండలంలోని 26 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను సీతక్క పంపిణీ చేశారు. స్థానికి ఎమ్మార్వో అధ్యక్షతన జిరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క , గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవిందనాయక్ , ఎంపీపీ బుర్ర రజిత పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా వెంకటాపూర్లో రైతులు నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. 2 నెలల కిత్రం తమ దగ్గర ద్వారక గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి ధాన్యం కొనుగోలు చేశాడని.. అయితే ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని ఆందోళన చేశారు. ఇదే విషయంపై పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు వాపోయారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర నుండి హైదరాబాద్కు డీసీఎం వాహనంలో తరలిస్తుండగా 500 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
జగిత్యాల పట్టణంలో పోలీసుల ఆపరేషన్ చబుత్ర చేపట్టారు. సరైన కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఎస్పీ ఆదేశాలతో ఈ ఆపరేషన్ చేపట్టిన డీఎస్పీ ప్రకాశ్ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఆపరేషన్లో పట్టణ సీఐ కిషోర్తో పాటు ముగ్గురు సీఐలు పాల్గొన్నారు.
నిజామాబాద్లో రైల్వే ఉద్యోగాల పేరిట భారీ మోసం చోటు చేసుకుంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలంటూ నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్, ఐడీ కార్డులు చూపించి ఓ గ్యాంగ్ అమాయకులకు కుచ్చుటోపీ పెట్టారు. ఒక్కొక్కరి నుంచి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. ఈ ఘటనలో 50 మందికి పైగా మోసపోయారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కొమురం భీం ఆసిఫాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీకే.సురేష్ కుమార్ హాజరై ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శమని.. ప్రజలతో పాటు పోలీస్ సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సురేష్ సూచించారు.
కొత్తగూడెం జిల్లాలో డబుల్ బెడ్ ఇండ్ల అక్రమాల పై విచారణ కోరుతూ మహిళలు నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి అర్హులకు డబుల్ బెడ్ రూం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. డబుల్ బెడ్ రూమ్ల కేటాయింపులపై పలు వార్డుల్లో లబ్దిదారుల నుండి కౌన్సిలర్లు లక్ష నుండి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల ఆందోళన కు సీపీఎం, బీఎస్పీ లు మద్దతు ప్రకటించాయి.
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ తనయుడు డా.సంజయ్ వైద్యశిభిరం ఏర్పాటు చేశారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి, నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పాటు సుమారు 300 మంది సిబ్బంది పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.