Kamareddy: కామారెడ్డి ఇంకా కుతకుతలాడుతోంది. రైతులు తగ్గేదేలే.. పోరాటం ఆపేదేలే అంటున్నారు. మధ్యలో బీజేపీ ఎంట్రీతో శుక్రవారం రాత్రి మరింత రణరంగం జరిగింది. ఇదే ఛాన్స్ గా పోలీసులు బీజేపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అటు, కలెక్టర్.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. ఎవరి భూములు లాక్కోమని.. ఇది జస్ట్ ప్రతిపాదన మాత్రమేనని కలెక్టర్ సెలవిచ్చారు. మరోవైపు, బాధిత రైతులు ఏకంగా హైకోర్టును ఆశ్రయించడంతో కామారెడ్డి కహానీ కంటిన్యూ అవుతూనే ఉంది.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనే మున్సిపల్ కమిషనర్కు లాయర్ ద్వారా నోటీసులు ఇవ్వగా.. తాజాగా మాస్టర్ ప్లాన్పై పలువురు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇక, శుక్రవారం రాత్రి కలెక్టరేట్ దగ్గర బీజేపీ చేసిన హంగామాపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. బండి సంజయ్తో పాటు మరో ఎనిమిది మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బండి సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, వెంకట రమణారెడ్డి తదితరులపై కేసులు పెట్టారు పోలీసులు.
మరోవైపు, మొత్తం ఘటనపై జిల్లా కలెక్టర్ పైనే విమర్శలు వస్తున్నాయి. రైతులతో చర్చలు జరపకపోవడం.. వారి నుంచి కనీసం వినతి పత్రం కూడా తీసుకోకపోవడంతో.. బాధితుల్లో ఆగ్రహం మరింత పెరిగి విషయం ఇంతలా ముదిరిందని అంటున్నారు. మాస్టర్ ప్లాన్ పై రైతులకు విడమరిచి చెప్పడంలో జిల్లా కలెక్టర్ విఫలమయ్యారని ప్రభుత్వం సైతం భావిస్తోంది. అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. కలెక్టర్ జితేష్ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చుకున్నారు.
ప్రస్తుత మాస్టర్ ప్లాన్ కేవలం ముసాయిదా దశలోనే ఉందని.. మార్పులు, చేర్పులు ఉంటాయని అన్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని.. ఇంకా సమయం ఉందని.. ఎవరైనా ఎలాంటి అభ్యంతరాలైనా ఇవ్వొచ్చని చెప్పారు. మాస్టర్ ప్లాన్ లో ఉన్నంత మాత్రాన రైతుల భూములు లాక్కొంటామని అర్థం కాదని.. ఎవరి భూములు తీసుకోమని కలెక్టర్ వివరించారు. మాస్టర్ ప్లాన్ అంటే భూసేకరణ కాదంటూ క్లారిటీ ఇచ్చారు కలెక్టర్.