Data Leak: వాడు మామూలోడు కాదు. ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 66 కోట్ల 90 లక్షల మంది పౌరుల వ్యక్తిగత సమాచారం సేకరించాడు. ఆ డేటాను అంగట్లో సరుకుగా అమ్మేసుకుంటున్నాడు. దేశాన్ని షేక్ చేసిన ఈ కేసును హైదరాబాద్ పోలీసులే బ్రేక్ చేశారు. NIA కూడా ఈ క్రైమ్పై నజర్ పెట్టింది. డేటా చోరీ ఘటనలో కీలక నిందితుడైన వినయ్ భరద్వాజను పోలీసులు అరెస్ట్ చేయడం లేటెస్ట్ అప్డేట్.
హరియాణాలోని ఫరీదాబాద్ వినయ్ భరద్వాజ స్వస్థలం. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా అతని నెట్వర్క్ విస్తరించింది. వినయ్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి రెండు ల్యాప్ టాప్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ ల్యాప్ టాప్లో ఏకంగా 66.9 కోట్ల మందికి చెందిన వ్యక్తిగత సమచారం ఉన్నట్టు గుర్తించడం షాకింగ్ న్యూస్. ఇందులో హైదరాబాద్కు చెందిన వారే కోటి వరకూ ఉన్నారట. ఇక ఏపీ నుంచి 2.5 కోట్ల మంది డేటా లీక్ అయిందని గుర్తించారు సైబర్ టీమ్.
వీరు వారు అంటూ ఎవరినీ వదలలేదు ఆ కేటుగాడు. మొత్తం 24 రాష్ట్రాలు, 8 మెట్రో పాలిటన్ సిటీస్ నుంచి వినయ్ భరద్వాజ డేటా సేకరించాడు. అమెజాన్, నెట్ ప్లిక్స్, యూట్యూబ్, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, ఇన్స్టాగ్రామ్, బుక్ మై షో, జీఎస్టీ, పాన్ కార్డు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఇన్కంటాక్స్, ఆప్ స్టాక్స్.. ఇలా అనేక మార్గాల్లో డేటా చోరీ చేశాడు.
చివరికి స్కూల్ పిల్లల డేటా కూడా వదలలేదు ఆ కంత్రీఫెలో. బైజూస్, ఎడ్టెక్, వేదాంత సంస్థల నుంచి 9, 10, 11, 12 చదివే విద్యార్థుల డేటాను తస్కరించాడు. అనేక మంది ప్రభుత్వ, రక్షణ రంగ ఉద్యోగుల డేటా కూడా ఉంది అతని దగ్గర.
ఇలా డేటా దొంగిలించడానికి.. ఏకంగా 4.5 లక్షల మంది ఉద్యోగులను తన తరఫున ఆయా సంస్థల్లో నియమించాడు వినయ్ భరద్వాజ్. అలా సేకరించిన డేటాను.. inspirewebz అనే వెబ్సైట్ ద్వారా అమ్మకానికి ఉంచాడని తేల్చారు పోలీసులు. ఎవరికి ఏ డేటా కావాలంటే ఆ డేటా. అంగడి సరుకు అయిపోయింది మన పర్సనల్ డేటా. దేశ పౌరుల పూర్తి సమాచారం విదేశీయులు, ఉగ్రవాదుల చేతికి చిక్కితే..?