Telangana elections : తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలహీనపడుతోంది. బలమైన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో కాషాయ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అసలు తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ఎందుకు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు? బీజేపీ పతనంతో ఏ పార్టీకి లాభం చేకూరుతుంది? ఇవే అంశాలపై ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది.
తెలంగాణలో 2018 నుంచి 5 ఉపఎన్నికలు జరిగాయి. అందులో దుబ్బాక, హుజురాబాద్, మునుగోడులో బీజేపీ-బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడ్డాయి. దుబ్బాక, హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగిరింది. మునుగోడులో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. అలాగే హుజూర్ నగర్, నాగార్జున్ సాగర్ ఉపఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఈ రెండు స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పోటీ ఇచ్చింది.
తెలంగాణలో గత 5 ఏళ్లలో జరిగిన 5 ఉపఎన్నికల్లో 3 చోట్ల బీఆర్ఎస్, 2 స్థానాల్లో బీజేపీ గెలిచాయి. కాంగ్రెస్ హుజూర్ నగర్, మునుగోడు సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఈ రెండు స్థానాలు గులాబీ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. అలాగే నాగార్జునసాగర్ స్థానాన్ని బీఆర్ఎస్ నెలబెట్టుకుంది. కానీ బీఆర్ఎస్ దుబ్బాక, హుజురాబాద్ సిట్టింగ్ స్థానాల్లో ఓడిపోయింది. ఈ రెండు చోట్ల గెలవడంతో బీజేపీ బలం మాత్రం రెండు స్థానాల్లో పెరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది.
ఇలా ఎన్నికల్లో గులాబీ పార్టీ, కమలం పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ దూకుడుగా ముందుకెళ్లింది. ఆ పార్టీలో చేరేందుకు చాలా మంది బలమైన నేతలు సిద్ధమయ్యారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం వేచి చూశారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. బీజేపీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ప్రభావం తెలంగాణపై పడింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీ పతనానికి తొలి అడుగు పడింది. అప్పటి వరకు ఆ పార్టీ బలంగానే కనిపించింది. కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైన నేతలు వెనుకడుగు వేశారు. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత కమలం పార్టీ మరింత డీలా పడింది. గతంలో బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించిన నేతలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనలు చేసినా లాభం లేకపోయింది. బీజేపీలో చేరందుకు నేతలెవరూ ముందుకు రావడంలేదు. ఇంకోవైపు ఇప్పటికే పార్టీలో ఉన్న కీలక నేతలు కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. ఉన్న నేతలను కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంది బీజేపీ.
బీజేపీ బలహీనపడటం ఏ పార్టీకి లాభం అనే చర్చ నడుస్తోంది. అయితే ఇది కాంగ్రెస్ కు ఫ్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చాలా వరకు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతాయనంటున్నారు. బలమైన నేతలు చేరడంతో కాంగ్రెస్ బలం మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి. ఇప్పుడు ఇదే అంశం గులాబీ పార్టీని కలవరపెడుతుందంటున్నారు. మరి బీజేపీ బలహీనపడటం కాంగ్రెస్ కే లాభామా? బీఆర్ఎస్ కు నష్టమా?