Siddipet news today(Local news telangana): సిద్ధిపేట జిల్లా గురించి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చాలా గొప్పలు చెబుతుంటారు. అది చేశాం, ఇది చేశాం.. అన్ని నిధులిచ్చాం.. ఎంతో అభివృద్ధి చేశామంటూ ఊదరగొడుతుంటారు. కానీ, తాజాగా జరిగిన ఓ బాధాకర ఘటన సిద్ధిపేట అభివృద్ధి మాటున దాగున్న లొసుగులను బట్టబయలు చేసింది. అసలేం జరిగిందంటే…
సిద్ధిపేట జిల్లాలో చనిపోయిన వ్యక్తి చివరి మజిలీకి అవస్థలు పడ్డారు గ్రామస్తులు. పాడెతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం వేచరిణి గ్రామంలో జరిగింది.
బాలయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. భారీ వర్షాలకు గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగింది. అంత్యక్రియల కోసం స్మశాన వాటికకు వెళ్లాలంటే ఆ వాగు దాటాలి. దీంతో చేసేది లేక.. పాడెతో వాగులో ఈదుకుంటూ వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు వేచరణి గ్రామస్థులు.
వాగుపై వంతెన లేకపోవడంతో తరచూ ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి, స్థానికుల విజ్ఞప్తిని సర్కారు పట్టించుకుంటుందా? హరీశ్రావు చొరవ చూపుతారా? చూడాలి.