Sharmila: షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నారా? ఈ ప్రచారం ఈమధ్య ఊపందుకోగా.. అందుకు బలం చేకూర్చేలా మాట్లాడారు.. YSR సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రాంచందర్రావు. షర్మిల త్వరలోనే కాంగ్రెస్లో చేరుతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారాయన. ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో రాహుల్ గాంధీని కలిసేందుకు కేవీపీ వెళ్లారు. ఆ క్రమంలో కేవీపీ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ఆర్ మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పని చేశారు. ఆయన బిడ్డ షర్మిల త్వరలోనే కాంగ్రెస్లో చేరుతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. షర్మిల తమ పార్టీలోకి రావడాన్ని కాంగ్రెస్ వాదిగా ఆహ్వానిస్తున్నాం అన్నారు కేవీపీ. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం. ఇటుక ఇటుక పేర్చుకుంటూ మళ్లీ ఎదుగుతున్నామన్నారు. పార్టీ బలోపేతం కోసం రాహుల్ గాంధీకి ఇక్కడ పరిస్థితిని వివరించామన్నారు. ఆయన చేసిన నిర్మాణాత్మక సూచనలను అమలు చేస్తామన్నారు కేవీపీ.
తెలంగాణలో వైఎస్ఆర్టీపీకి అనుకున్నంత ప్రజాదరణ దక్కకపోవడంతో.. షర్మిల త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలు కూడా జరుగుతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఏపీ కాంగ్రెస్లో షర్మిల సేవలను వినియోగించుకునే ఉద్దశంతో అధిష్టానం ఉందని, ఆమెను రాష్ట్ర పార్టీ చీఫ్ చేసి, పార్టీకి మళ్లీ పునర్వైభవం తెచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు చర్చ జరిగింది. అటు షర్మిల కూడా ఆ ప్రచారాన్ని పెద్దగా ఖండించకపోవడంతో.. కాంగ్రెస్లో చేరనున్నారనే వార్తలకు బలం చేకూరింది.
మరోవైపు షర్మిల కూడా కొంతకాలంగా వైఎస్ఆర్టీపీ తరపున యాక్టివ్గా లేరు. కర్నాటకకు వెళ్లి డీకే శివకుమార్ను కలిసినప్పటి నుంచే ఆమె కొంచెం వెనక్కి తగ్గారు. తాజా కేవీపీ వ్యాఖ్యలతో.. త్వరలోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఆమె సేవలను ఏపీలో వినియోగించుకుని..పార్టీని రేసులోకి తీసుకురావాలని చూస్తోంది కాంగ్రెస్.
లేటెస్ట్గా వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయినట్టు తెలుస్తోంది. వైఎస్సార్కు సన్నిహితుడు, కాంగ్రెస్ కీలక నాయకుడైన జానారెడ్డితో షర్మిల సమావేశంతో ఆమె హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇవ్వనుందనే ప్రచారం మరింత జోరందుకుంది.