KU Ragging : కాకతీయ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను వేధింపులకు గురి చేస్తున్న సీనియర్ విద్యార్థినులను కేయూ(KU) అధికారులు సస్పెండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ మహిళా హాస్టళ్లలో కొద్దిరోజులుగా జూనియర్లను పరిచయ కార్యక్రమం పేరుతో సీనియర్లు వేధిస్తున్నారు.
విద్యార్థినులకు వసతి కల్పించడం కోసం కాకతీయ యూనివర్సిటీలో 5 హాస్టల్స్ ఏర్పాటు చేశారు. పద్మాక్షి ఏ, బీ, సీ, డీ, ఈ బ్లాక్ లు విద్యార్థినుల కోసం కేటాయించారు. పద్మాక్షి ఏ బ్లాక్ వద్ద కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన సీనియర్ విద్యార్థినులు ఉండగా.. వాళ్లంతా కొద్దిరోజులుగా జూనియర్లను వేధిస్తున్నారు.
ఈ నెల 18న వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ప్రొఫెసర్లు.. రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు నివేదిక అందించారు. అనంతరం ర్యాగింగ్ కు పాల్పడిన సుమారు 81 మంది సీనియర్ విద్యార్థులపై అధికారులు వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు.
గత ఫిబ్రవరిలో కేయూ మెడికల్ కళశాలలో ర్యాగింగ్ వేధింపుల వల్ల డాక్టర్ ప్రీతి సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత వేధింపులకు గురిచేసిన నిందితుడు సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి తనపై చర్యలు తీసుకున్నారు. కాగా ఈ విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
తాజాగా కేయూ క్యాంపస్ లో సీనియర్ల వేధింపులకు పాల్పడిన వ్యవహారం బయటకు రాకుండా యూనివర్సిటీ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. కాకతీయ వైద్య కళాశాల నేపథ్యంలో కేయూ అధికారులు యాంటీ ర్యాగింగ్ సెల్ మీటింగ్ లు నిర్వహించాల్సి ఉండగా.. యూనివర్సిటీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మరి కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి.