KTR : ఒకరు ప్రపంచలో టాప్ సంస్థల్లో ఒకటైన మెక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల. మరొకరు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ ఇద్దరూ కలిస్తే ఏం మాట్లాడుకుంటారు. బిజినెస్ గురించే చర్చిస్తారు. కానీ ఈసారి భేటీలో బిజినెస్ తోపాటు మరో అంశంపై చర్చించారు. అదే అప్పుడు ఆసక్తికరంగా మారింది.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారత్లో పర్యటిస్తున్నారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తో సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇద్దరు హైదరాబాదీలు సమావేశంతో ఈ రోజును ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బిజినెస్, బిర్యానీ గురించి మట్లాడుకున్నామని కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఫోటోలకు ఓ స్మైల్ ఎమోజీని జత చేసి షేర్ చేశారు. రాష్ట్రంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల వృద్ధిపై చర్చించామని తెలిపారు. హైదరాబాద్లో అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను సత్య నాదెళ్లకు కేటీఆర్ వివరించినట్లు సమాచారం. కొత్త సాంకేతికతపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు సత్య నాదెళ్ల, కేటీఆర్ భేటీలో బిజినెస్ తోపాటు బిర్యానీ గురించి మాట్లాడుకోవడం ఆసక్తిని రేపింది. ఇంతకీ విషయమేమిటంటే గురువారం చాట్ రోబోట్ సాఫ్ట్వేర్ చాట్జీపీటీకి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు మధ్య హైదరాబాద్ బిర్యానీ గురించి ఆసక్తికర సంభాషణ జరిగింది. బెంగళూరులోని ఫ్యూచర్ రెడీ సమ్మిట్లో పాల్గొన్న సత్య నాదెళ్ల పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏమిటో చెప్పాలని చాట్జీపీటీని అడిగారు. దీనికి సమాధానంగా చాట్జీపీటీ రోబో.. ఇడ్లీ, దోశ, వడ పేర్లు చెబుతూనే బిర్యానీని కూడా టిఫిన్గా పేర్కొంది. అందుకే ఇప్పుడు దీనిపై కేటీఆర్, సత్య నాదెళ్ల మధ్య సరదా సంభాషణ జరిగింది.