KTR: హైదరాబాద్ సిటీలోకి రావాలంటే.. ఎల్బీనగర్ నుంచే ట్రాఫిక్తో నరకం మొదలవుతుంది. కానీ.. ఇప్పుడు ఆ బాధ తప్పనుంది. ఎల్బీనగర్లో ఇప్పటికే సిటీ నుంచి బయటకు వెళ్లే రూట్లో ఫ్లై ఓవర్ మొదలు కాగా.. తాజాగా సిటీ లోకి వచ్చే రూట్లో ఫ్లైఓవర్ ప్రారంభమైంది. ఇక నుంచి ఎల్బీనగర్ జంక్షన్లో ఆగాల్సిన అవసరం లేదు. నేరుగా ఫ్లైఓవర్ మీదుగా సిటీలోకి ఎంటర్ అవ్వచ్చు. వనస్థలిపురం – దిల్సుఖ్ నగర్ మార్గంలో ఎల్బీనగర్ కూడలి దగ్గర నిర్మించిన ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి హయత్ నగర్ మీదుగా వచ్చే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 700 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు గల ఈ ఫ్లై ఓవర్ వలన వాహనాల వేగం కూడా పెరగనుంది. ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది.
SRDP ద్వారా చేపట్టిన 47 పనుల్లో.. ఇప్పటివరకు 35 పనులు పూర్తి కాగా.. వాటిలో పంతొమ్మిదవదైన ఎల్బీనగర్ RHS ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మిగతా శాఖలకు సంబంధించిన ఆరు పనుల్లో 3 పూర్తికాగా మరో 3 వివిధ దశల్లో ఉన్నాయి. ఎల్బీనగర్ RHS ఫ్లైఓవర్ను సివిల్ పనులు, యుటిలిటి షిప్టింగ్తో పాటు భూసేకరణతో సహా మొత్తం 32 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు.
ఫ్లైఓవర్ ఓపెనింగ్ సందర్భంగా మంత్రి కేటీఆర్ అనేక హామీలు ఇచ్చారు. నాగోల్ మెట్రోను ఎల్బీనగర్ వరకు పొడిగిస్తామన్నారు. ఎల్బీనగర్ మెట్రోను హయత్నగర్ వరకు విస్తరిస్తామని చెప్పారు. ఎల్బీనగర్ సెంటర్కు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి పేరు పెడతామని ప్రకటించారు.