KTR Vs Bandi : తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరుపార్టీల నేతలు మైకులు పట్టుకుంటే సవాళ్లు విసురుకుంటున్నారు. ట్వీట్లతోనూ వార్ కొనసాగిస్తున్నారు. కేంద్రాన్ని, ప్రధాని మోదీని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తుంటే.. కేసీఆర్ పై కాషాయ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్, బండి సంజయ్ మధ్య మరోసారి ట్విటర్ లో వార్ నడిచింది.
కేటీఆర్ ఎటాక్..
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ ప్రాధాన్యాల్లో తెలంగాణ లేదని.. అలాంటప్పుడు రాష్ట్ర ప్రజల ప్రాధాన్యాల్లో మోదీ, బీజేపీ ఎందుకుండాలని ప్రశ్నించారు. “తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఇవ్వనని మోదీ చెప్పారు. మెట్రో రెండో దశ, ఐటీఐఆర్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చేశారు. విభజన చట్టంలోని హామీలను మోదీ అమలు చేయట్లేదు. దీనికి రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలి. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు కానీ, గుజరాత్ లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీకి రూ.20 వేల కోట్లు ఇచ్చారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్న ఫలితమిది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
బండి కౌంటర్..
కేటీఆర్ చేసిన ట్వీట్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వనప్పుడు కేసీఆర్ను ప్రజలు ఎందుకు భరించాలి? సహించాలి? అని ప్రశ్నించారు. తన పార్టీ నుంచే తెలంగాణ పేరును తొలగిస్తే.. కేసీఆర్ను ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించకూడదన్నారు? ఉద్యమకారులకు పార్టీలో చోటు, దళితులకు మూడెకరాలు, దళిత సీఎం, ఉద్యోగ నియామకాలు , నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పంచాయతీ, మున్సిపాలిటీలకు, ఆలయాలకు నిధులు ఇవ్వని కేసీఆర్ను ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించకూడదు? అని బండి నిలదీశారు.
సీఎం కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ సెటైరికల్గా మరో ట్వీట్ చేశారు. దేశంలో అత్యధిక వేతనం రూ.4.1 లక్షలు తీసుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. కేటీఆర్ పరువు నష్టం విలువ రూ.100 కోట్లు అని, కుమార్తె కవిత వాచ్ ధర రూ.20 లక్షలు అని విమర్శించారు. మరి ఈ రాష్ట్రంలో కుక్కల దాడిలో మరణించిన పిల్లల కుటుంబాలు, ర్యాగింగ్ బూతానికి బలైన బాధితులు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన నిరుద్యోగుల విలువ ఎంత? అని సంజయ్ ప్రశ్నించారు. ఇలా ఏదో ఒక అంశంపై నిత్యం బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.