KTR Reaction on Kavitha Bail: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ సోషల్ మీడియా (ఎక్స్)లో పోస్ట్ చేశారు. ‘థాంక్యూ సుప్రీంకోర్టు.. ఊరట లభించింది.. న్యాయం గెలిచింది’ అంటూ కేటీఆర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read: కవితకు బెయిల్ రావడంపై బండి సంజయ్ రియాక్షన్.. సోషల్ మీడియాలో ట్వీట్
ఇదిలా ఉంటే.. కవితకు బెయిల్ రావటంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. వాటిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా బండి సంజయ్ కామెంట్స్ చేశారంటూ కేటీఆర్ అన్నారు. బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడుతారా ? అంటూ ఆయన విమర్శించారు. అదేవిధంగా.. దురుద్దేశపూర్వకంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు.