KTR: కేసీఆర్ కస్సుమంటారు. అది ఆయన స్టైల్. కేటీఆర్ కూల్ గా మాట్లాడతారు. ఇది ఈయన స్టైల్. తండ్రికొడుకుల యాటిట్యూడ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. బీజేపీ అంటేనే సర్రున కోపం వస్తుంది కేసీఆర్కి. అందులోనూ ఈటల రాజేందర్ అంటే మరింత మంట. తననే కాదంటారా? అంటూ రాజేందర్ పై రాజకీయంగా రచ్చ రచ్చ చేశారు. పార్టీని వీడేలా చేసి.. హుజురాబాద్ లో ఓడించేందుకు విశ్వప్రయత్నం చేసి.. చివరకి సైలెంట్ అయిపోయారు. ఆ ఓటమి భారం గులాబీ బాస్ ను ఇంకా వెంటాడుతోందని.. వచ్చే ఎన్నికల్లో ఈటలపై కౌశిక్ రెడ్డిని ప్రయోగించి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.
అలాంటిది.. కేసీఆర్ కు అసలేమాత్రం గిట్టని ఈటల రాజేందర్ తో మంత్రి కేటీఆర్ మాత్రం కులాసాగా కబుర్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆ సంఘటన అసెంబ్లీలో జరిగింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ కేటీఆర్.. ఈటలతో ఎందుకు మాట్లాడినట్టు? ఏం మాట్లాడినట్టు?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేతలను అధికార బీఆర్ఎస్ సభ్యులు పలకరించారు. మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ ల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఆ తర్వాత ఈటలతో ప్రత్యేకంగా ముచ్చటించారు. హుజురాబాద్ లో జరిగిన అధికారిక కార్యక్రమానికి ఎందుకు రాలేదంటూ ఈటలను ఆరా తీశారు. పిలిస్తేగా వచ్చేది.. అంటూ ఈటల కాసింత కటువుగానే ఆన్సర్ ఇచ్చారని తెలుస్తోంది.
వారం రోజులుగా హుజురాబాద్ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. మంత్రి కేటీఆర్ జగిత్యాలలో జరిగిన సభలో ఈటల రాజేందర్ పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. తండ్రిలాంటి కేసీఆర్ ను మోసం చేశారని.. తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశారంటూ.. సెంటిమెంట్ రాజేశారు. అప్పుడు పబ్లిక్ గా అన్నేసి మాటలు మాట్లాడి.. ఇప్పుడు మాత్రం సభలో సైలెంట్ గా ఆ మాటల మంటలపై అయింట్మెంట్ పూసినట్టు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇరు పార్టీ నేతలు ఎక్కడా తగ్గట్లే. బండి సంజయ్ దూకుడు మామూలుగా లే. హాట్ హాట్ కామెంట్లతో బండి యమ జోరుగా దాడి చేస్తోంది. బీఆర్ఎస్ నేతలు సైతం బండి సంజయే టార్గెట్ గా రివర్స్ అటాక్ చేస్తున్నారు. కేటీఆర్ అయితే పదే పదే బండిపై మాటల బాంబులు విసురుతున్నారు. దీంతో.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోరు కాస్తా.. బండి వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మారిపోయింది. మిగతా నేతలతో డైలాగ్ వార్ నడుస్తున్నా.. కలిస్తే వారంతా మంచిగానే మాట్లాడుకుంటారు. బండి సంజయ్ మాత్రం ముఖం కూడా చూడరు. పలకరింపు కూడా ఉండదు.
అందుకే, బండి సంజయ్ తోనే సమస్యంతా అన్నట్టుగా.. మిగతా బీజేపీ నేతలతో తమకేమీ ప్రాబ్లమ్ లేదన్నట్టుగా.. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలతో చిట్ చాట్ గా మాట్లాడారని అంటున్నారు. అయితే, ఈ ఎపిసోడ్ పరోక్షంగా ఈటలకే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈటల రాజేందర్ పై ఓ వర్గం రకరకాల ప్రచారం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈటల, కేటీఆర్ లు కులాసాగా మాట్లాడుకోవడం.. బీజేపీలో ఆయన మరింత కార్నర్ అయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇలా కావాలనే.. కేటీఆర్ మైండ్ గేమ్ ఆడారా? అనే అనుమానమూ వ్యక్తం అవుతోంది. జస్ట్ ఫార్మల్ టాక్ మాత్రమేనని.. దాని వెనుక అంత లెక్కలు ఉండవనే మాటా వినిపిస్తోంది.