హైదరాబాద్, స్వేచ్ఛ: రాష్ట్రంలోని పలుచోట్ల గురుకులాల అద్దె భవనాలకు తాళం వేయడం చర్చనీయాంశమైంది. భవనాల యజమానులు పెండింగ్ బకాయిల కోసం తాళాలు వేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. గురుకుల భవనాలకు అద్దె చెల్లింపులు లేవు, కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు, కనీసం అన్నం పెట్టలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారింది అంటూ మండిపడ్డారు. చదువు పక్కనపెట్టి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు రోడ్లపై ధర్నాలు చేసే దుస్థితికి తెచ్చిందన్నారు.
ఢిల్లీకి మూటలు పంపడమే మీ పనా?
రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ ప్రైవేట్ కాలేజీలను నిరవధికంగా మూసివేయటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించకుండా పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని ఫైరయ్యారు కేటీఆర్. ‘‘మూసీ కోసం రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసే కాంగ్రెస్ సర్కార్ దగ్గర అద్దె, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వటానికి పైసలు లేవా? రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రికి విద్యారంగంలో సమస్యలను తెలుసుకునే ఓపిక లేదు. రాష్ట్రంలో విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిందిపోయి. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపించే పనిలోనే ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతోంది. ఢిల్లీకి మూటలు పంపించటంపై ఉన్న శ్రద్ధ, విద్యార్థులకు మేలు చేయటంలో లేదా? కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించినా, సర్కారుకు చీమ కుట్టినట్లైనా లేదా? వెంటనే రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు చెల్లించాలి. విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే బీఆర్ఎస్ సహించదు’’ అంటూ హెచ్చరించారు.
Also Read: క్యాట్లోనూ ఆ ఐఏఎస్లకు చుక్కెదురు.. వెళ్లిపోవాల్సిందేనంటూ..
సీఎం గారూ.. స్పందించండి
ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ప్రభుత్వం 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యజమాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కు తాళం వేశారని, కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అధ్వాన్న స్థితికి చేరుకున్నదనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు. గురుకులాలకు అద్దెలు ఇంకెప్పుడు చెల్లిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజురోజుకి దిగజారిపోతున్న విద్యావ్యవస్థ గురించి విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్న మీరు, ఇంకెప్పుడు పట్టించుకుంటారు అంటూ సీఎంను ప్రశ్నించారు.