KTR: అదానీ. ఈ పేరు మళ్లీ మారుమోగిపోతోంది. గతంలో సంపాదనలో అదానీ గ్రూప్ పేరు వినిపిస్తే.. ఈసారి పతనంలో అదానీ స్టాక్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కంపెనీ విలువను ఎక్కువ చేసి చూపించారని.. లెక్కలు సరిగా లేవని.. షేర్లు తాకట్టు పెట్టి భారీ మొత్తంలో అప్పులు చేశారంటూ.. పూర్తి రీసెర్చ్ తో సమగ్రమైన రిపోర్ట్ వెలువడించింది హిండెన్బర్గ్. ఆ నివేదికే ఇప్పుడు దేశంలో ప్రకంపనలు రేపుతోంది.
వరుసగా రెండు మార్కెట్ సెషన్లలో అదానీ గ్రూపునకు చెందిన 10 స్టాక్స్ భారీగా ఫాల్ అయ్యాయి. రెండు రోజుల్లో 5 లక్షల మార్కెట్ షేర్ కోల్పోయింది అదానీ. ఇకముందూ మరింత పతనమవుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
అదానీ గ్రూప్ స్టాక్స్ తో పాటు ఎల్ఐసీ, ఎస్బీఐ షేర్లు కూడా బాగా కరెక్ట్ అయ్యాయి. ఈ రెండు షేర్లు కూడా సుమారు 5 శాతం పడిపోయాయి. ఎందుకు? అదానీకి ఎల్ఐసీ, ఎస్బీఐ కి ఏంటి లింకు? అంటే…
అదానీ స్టాక్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టాయి ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు. ఇదే ఇప్పుడు కాంట్రవర్సీకి కారణమవుతోంది. అదానీ గ్రూపులో అంత పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్న. ఎల్ఐసీ, ఎస్బీఐ రెండూ ప్రభుత్వ రంగ కంపెనీలు కాబట్టి.. వాటితో ఎవరైనా బలవంతంగా అంతమొత్తం పెట్టుబడి పెట్టించారా? అనే అనుమానం. ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
అదానీ గ్రూప్ స్టాక్ల్లో ఎల్ఐసీ 77 వేల కోట్లు, ఎస్బీఐ 80 వేల కోట్లు పెట్టుబడి ఎందుకు పెట్టాయి? ఎల్ఐసీ, ఎస్బీఐ సంస్థలను అలా నెట్టిందెవరు? ఈ మొత్తం వ్యవహారంలో అదానీకి ఎవరు సహాయం చేశారు? అంటూ పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా ప్రశ్నలు సంధించారు కేటీఆర్.
అటు, అన్నలానే చెల్లి సైతం అదానీ విషయంలో ట్విట్టర్లో కేంద్రాన్ని నిలదీశారు. ఈ పరిణామాలపై ప్రతీ ఒక్క భారతీయుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత.