KTR: త్వరలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదే. ఎప్పటిలానే ఈసారి కూడా తెలంగాణకు మొండిచేయేనని అంటున్నారు. అయినా, మన ప్రయత్నం మనం చేయాలిగా.. అన్నట్టు మంత్రి కేటీఆర్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. తెలంగాణకు నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రగతికి సహకరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖలో విన్నపాలు వినిపించారు.
–హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్పూర్, హైదరాబాద్ – విజయవాడ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలి.
–హైదరాబాద్లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి,
–హైదరాబాద్ ఫార్మా సిటీకి బడ్జెట్లో నిధులు కేటాయించాలి.
–కేంద్రం ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్లో హైదరాబాద్ను చేర్చాలి.
–వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలి. బడ్జెట్లో కనీసం రూ.300 కోట్లు కేటాయించాలి.
–సిరిసిల్లకు టెక్స్టైల్ పార్క్, వీవింగ్ పార్క్, అపెరల్ పార్క్లతో కూడిన మెగా పవర్లూమ్ క్లస్టర్ను మంజూరు చేయాలి. పవర్ లూమ్ల అప్గ్రేడేషన్ చేపట్టాలి. బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు మంజూరు చేయాలి.
–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని తెలంగాణలో ఏర్పాటు చేయాలి.
–జహీరాబాద్ నిమ్జ్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు ఇవ్వాలి. రూ.9,500 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో కనీసం రూ.500 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి.
–జడ్చర్ల పారిశ్రామిక పార్కులో ఉమ్మడి వ్యర్థాల శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేయాలి,
–బ్రౌన్ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల మంజూరు, అప్గ్రేడేషన్ చేపట్టాలి.
–ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలి.