KTR , Kavitha : తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరుపార్టీల నేతలు పరస్పరం సవాళ్లు విసురుకుంటూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు. నిత్యం బండి సంజయ్, కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మధ్య మధ్యలో మంత్రి హరీష్ రావు , ఎమ్మెల్సీ కవిత నేరుగా కేంద్రంపైనే ఎటాక్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కేటీఆర్ తెలంగాణ సమస్యలపై ప్రధాని మోదీకి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా మరోలేఖను ప్రధానికి.. కేటీఆర్ రాశారు. కానీ ఈసారి తెలంగాణ సమస్యలపై కాదు.. ఏపీలో అగ్గిరాజేస్తున్న అంశంపై కేంద్రానికి కేటీఆర్ లేఖ రాయడం ఆసక్తిని రేపింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోంది ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు రూ.12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కేంద్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎందుకు ఔదార్యం చూపడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఉత్పత్తులను కేంద్రం కొనుగోలు చేయడంతోపాటు వర్కింగ్ క్యాపిటల్కు ఆర్థికసాయం అందించాలని లేఖలో కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.సెయిల్లో విలీనంపై పరిశీలించాలని కేంద్రాన్ని కేటీఆర్ కోరారు.
అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ ఇటీవల మూడుసార్లు విచారించింది. తొలిసారి ఈడీ విచారణకు పిలవడానికి ముందు ఆమె మహిళా రిజర్వేజన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. రెండో విచారణ కోసం హాజరయ్యే ముందు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఢిల్లీలోనే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని కవిత డిమాండ్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 3సార్లు ఈడీ విచారించిన తర్వాత.. కవిత తగ్గేదేలేదంటూ ముందుకు సాగుతున్నారు. దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉందని తాజాగా కవిత ట్విట్టర్ వేదికగా కేంద్రంపైనా ,మోదీపై విమర్శలు గుప్పించారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మోస పూరిత హామీతో దేశ యువతను బీజేపీ ప్రభుత్వం దగా చేసిందని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని కవిత ప్రశ్నించారు.
నిజమైన డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్లకు దేశంలో ఉద్యోగాలు రావని.. కానీ, డిగ్రీ లేని వాళ్లకు మాత్రం దేశంలోనే అత్యున్నత ఉద్యోగం ఉందని మోదీని ఉద్దేశించి కవిత ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించి ఎలాంటి డిగ్రీలు చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో కవిత ట్వీట్ చేశారు. ఇలా కేటీఆర్, కవిత.. కేంద్రాన్ని, ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. మరి తెలంగాణ బీజేపీ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారనేది ఆసక్తిగా మారింది.