కేటీఆర్ ఇప్పుడు టీవీ స్టూడియాలు, యూట్యూబ్ ఛానెల్స్ కు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండగా.. ప్రచారాల్లో బిజిబిజీగా ఉండాల్సిన టైంలో ఇలా ఇన్ డోర్ ఇంటర్వ్యూలు ఇవ్వడం జనంలో బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. ఫ్రస్టేషన్ తోనే ఇలా చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఓ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుందంటే.. ఆ సినిమా యూనిట్ అడగకపోయినా వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. కాస్తో కూస్తో నష్టాన్ని తగ్గించుకునేందుకు ఇలా చేస్తుంటారు. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కూడా ఇలాగే తయారైందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గులాబీదళానికి ఎదురుగాలి వీస్తుండడంతో చివరకు ఇలా ఇంటర్వ్యూల ఫార్ములానే నమ్ముకున్నారా అన్న చర్చ జరుగుతోంది.
మొదట జయప్రకాశ్ నారాయణకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా జేపీని ఫాలో అయ్యే వారితో పాటు కమ్మ సామాజికవర్గం, అలాగే సెటిలర్స్ ను రీచ్ అవ్వొచ్చన్న ఆలోచనే ఉందంటున్నారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అందులో ఒకటి చెప్పాలనుకుని ఇంకోటి చెప్పి అడ్డంగా ఇరుక్కుపోయారన్న భావనే అందరిలోనూ కలుగుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ముక్కుసూటిగా ప్రశ్నలు అడిగే తత్వం. ఇందులో ఫాక్స్ కాన్ విషయంలో నిర్ధారణ చేసుకోకుండానే ఆరోపణలు చేశానని కేటీఆర్ ఒప్పుకున్నారు. అంతటితో ఆగకుండా.. ఈ భూమ్మీదకు ప్రతీ ఒక్కరూ ఎక్స్పైరీ డేట్తో వస్తారని, అధికారం శాశ్వతం అని అహంభావంతో ఎవరైనా అనుకుంటే వారు అజ్ఞానులే అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 90 శాతం ప్రజలు విసిగిపోతే ఏ పార్టీనైనా ఇంటికి పంపిస్తారని అంటుండటం ఎన్నికల ముందు కీలకంగా మారింది.
ఎన్నికలకు టైం దగ్గరపడుతుంటే.. కేటీఆర్ ఇంటర్వ్యూల బిజీలో ఉంటున్నారని బీఆర్ఎస్ నేతలే అనుకుంటున్నారు. కామారెడ్డి ప్రచార ఇన్ఛార్జ్ బాధ్యతలను కేసీఆర్.. ఎవరినీ నమ్ముకోకుండా తన కొడుకు కేటీఆర్ కే అప్పగించారు. అక్కడ చూస్తే బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఈ ఇంటర్వ్యూలతో జనంలోకి వెళ్లాలనుకోవడమే గులాబీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తోందంటున్నారు. పైగా గంగవ్వ సహా వారి టీమ్ మెంబర్స్ తో కలిసి కేటీఆర్ ఓ వీడియో చేశారు. అందులో పొలంలోకి వెళ్లి నాటుకోడి వండడం ఇవన్నీ జరిగాయి. పోనీ అదేమైనా కొత్త ప్రయోగమా అనుకుంటే అదీ కాదు. అలాంటి వీడియో రాహుల్ గాంధీ 2021లోనే తమిళనాడుకు చెందిన విలేజ్ కుకింగ్ ఛానెల్ వాళ్లతో కలిసి చేశారు. ఇప్పుడు కేటీఆర్ దాన్ని కాపీ కొట్టారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.
పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్నా కొద్దీ ఎదురుగాలి మరింత బలంగా వీస్తున్నా కొద్దీ.. కేటీఆర్ చివరి అస్త్రంగా ఇలాంటి ఇంటర్వ్యూల బాట పట్టారంటున్నారు. జనాన్ని చివరిసారిగా ఇన్ ఫ్లూయెన్స్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. పైగా ఈ ఇంటర్వ్యూల్లో తాము చేసింది, చేయబోయేది చెప్పుకోవడం తక్కువ.., కాంగ్రెస్ ను విమర్శించడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. నిజానికి ఈ పదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని గొప్పగా చేసి ఉంటే ఇన్ని ఇంటర్వ్యూలు అక్కర్లేదన్న వాదన వినిపిస్తోంది. కొత్తగా హామీలు ఇవ్వబోమని, ఉన్నవే కంటిన్యూ చేస్తామని గతంలో వైఎస్ చెప్పి గెలిచిన సందర్భం ఉంది. కాంగ్రెస్ అంటే నమ్మకం, నమ్మకం అంటే కాంగ్రెస్ అన్నంత పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పినవే చేయలేని పరిస్థితులు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి.