KTR: “మీ దయ ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తా.. వచ్చి పనిచేస్తా”. ఇది ఏ అనామక ఎమ్మెల్యేనో చేసిన కామెంట్ కాదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మినిస్టర్, సిరిసిల్ల ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ చెప్పిన డైలాగ్. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
కేటీఆర్ ఏంటి? ఇలా అనడం ఏంటి? ప్రజల దయ ఉంటే గెలుస్తానన్నారంటే..? సిరిసిల్లలో ఓడిపోతాననే భయమా? గెలవనేమోననే బెదురా? ఆయన మాటల్లో అంతటి అభద్రతా భావం ఎందుకు? పక్కా గెలుస్తానని చెప్పలేకపోతున్నారా? విజయంపై ధీమా సడలిందా? అందుకే, ఇలా వేదాంత ధోరణిలో మాట్లాడారా? అనే చర్చ నడుస్తోంది.
ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. ఎమ్మెల్యేగా సొంత నియోజకవర్గమైన సిరిసిల్లను.. బంగారు తునకగా మార్చేశారు కేటీఆర్. అదిఇదీ అనికాదు.. ఒక ప్రాంతాన్ని ఎంతగా డెవలప్ చేయొచ్చో అంతకంటే ఎక్కువే చేసి చూపించారు. రోడ్లు, భవనాలు, పథకాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు.. లేటెస్ట్గా ఐటీ పార్క్ కూడా. ఇంత చేసినా.. ప్రజల దయ ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ నిరుత్సాహకరమైన వ్యాఖ్యలు చేశారంటే ఏమనుకోవాలి? సర్వేలు అలా వచ్చాయా? కేటీఆర్కే గెలుపుపై ధీమా లేకపోతే.. ఇక మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇంకెలా ఉంటుంది?
రెండుసార్లు అధికారం ఇచ్చారు ప్రజలు. జనాలకు చేసిందానికంటే.. మాటలు చెప్పిందే ఎక్కువ. అరచేతిలో స్వర్గం చూపించి.. ఆ తర్వాత అన్నీ అటకెక్కించేశారు సీఎం కేసీఆర్. పింఛన్లు, రేషన్ కార్డులు, గొర్రెల పంపిణీ, దళితబంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లాంటివి.. కొందరికే. వాటిని చూపెట్టి అందరూ తమకే ఓటేయాలంటే ఎట్టా? ప్రజలను పట్టించుకోకుండా.. నెలల తరబడి పార్టీ విస్తరణపైనే ఫోకస్ పెట్టారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకుని.. ఇతర రాష్ట్రాలు తిరుగుతున్నారు. తెలంగాణను అంతగా పట్టించుకోవట్లేదనే విమర్శ ఉంది.
మొదటిసారి సీఎం అయిన కొత్తలో.. జిల్లా జిల్లా తిరిగి అదిచేస్తా, ఇదిచేస్తా అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు కేసీఆర్. కరీంనగర్ను డల్లాస్ చేస్తానని.. వరంగల్ను ఇంకేదో చేస్తానని.. నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చివెళ్లారు. కలెక్టరేట్లు అయితే కట్టించారు కానీ.. ఉస్మానియాతో సహా ఏ ఆసుపత్రి భవనాలనూ పట్టించుకోలేదు. ఉద్యోగాలు నోటిఫికేషన్లకే పరిమితమయ్యాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకులతో పరువంతా పోయింది. నిరుద్యోగులు కేసీఆర్ సర్కారుపై రగిలిపోతున్నారు. ధాన్యం కొనుగోలులో కిరికిరి పెట్టి.. రైతుల చేతికి బేడీలు వేసి.. అన్నదాతలకు ఆగ్రహం తెప్పించారు. భూములు, స్కాములంటూ.. కేసీఆర్ సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీఇన్నీ కావు. ఇలా చెప్పుకుంటూ పోతే.. అనేక రంగాల్లో, అనేక విధాలుగా కేసీఆర్ సర్కార్ అట్టర్ఫ్లాప్ అయిందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఈసారి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గులాబీ బాస్ చేయిస్తున్న సర్వేల్లో అదే వ్యక్తమవుతోందని తెలుస్తోంది. అందుకే, గెలుపుపై ఆ పార్టీ నేతల్లో ఆశ సన్నగిల్లిందని అంటున్నారు. పక్కాగా గెలుస్తామనే నమ్మకం కేటీఆర్లోనే కనిపించడం లేదని.. ప్రజల దయ ఉంటే మళ్లీ గెలుస్తానంటూ.. పరోక్షంగా ఓటమి భయాన్ని వ్యక్తం చేశారని చర్చించుకుంటున్నారు.