KTR Delhi tour: బీఆర్ఎస్ కొత్త ప్లాన్ వేస్తోందా? ఆ పార్టీకి చెందిన 20 ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? కవిత బెయిల్పై వస్తుందని కచ్చితమైన సంకేతాలు ఉన్నాయా? కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఢిల్లీకి ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఉన్నట్లుండి ఢిల్లీకి కేటీఆర్ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకెళ్తున్నట్లు? బీజేపీ పెద్దలతో మాట్లాడానికేనా? రెండువారాల కిందటకి ఒక్కసారి వెళ్దాం.. కేటీఆర్, హరీష్రావు ఢిల్లీకి వెళ్లారు. దాదాపు వారంరోజుల పాటు అక్కడే మకాం వేశారు. బీజేపీలో కారు పార్టీని కలిపేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
గతంలో సీఎం రేవంత్రెడ్డి మీడియా చిట్చాట్లో ఇదే విషయాన్ని సూచన ప్రాయంగా తెలిపారు. కారు పార్టీ కలిసిపోవడం ఖాయమని, కాకపోతే పదవులపై తుది చర్చలు జరుగుతున్నాయని చెప్పు కొచ్చారు. సీన్ కట్ చేస్తే.. పార్టీ విలీనం విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదు. తాజాగా 20 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లాలని ప్లాన్ చేశారట కేటీఆర్.
ALSO READ: హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్.. వాటిపై నిర్ణయమేంటి? ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్న
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక తీర్పు మంగళవారం వెలువడనుంది. ఈ కేసులో నిందితురాలు, ఎమ్మెల్సీ కవిత బెయిల్పై తీర్పు అనుకూలంగా వస్తోందని భావిస్తోంది. ఈసారి ఆమెకు బెయిల్ ఖచ్చితంగా వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. ఈ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని, కావున కవితకు వస్తుందని బయటకు చెబుతున్నమాట.
తీహార్ జైలు బయట కవితకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ఎమ్మెల్యేలను హస్తినకు రెడీ అవుతున్నట్లు కారు పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా, బెయిల్ వస్తుందని నమ్మకం ఉండడం వల్లే ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్తున్నారా ప్రత్యర్థుల నుంచి అప్పుడే సెటైర్లు పడిపోతున్నాయి.
ఈ లెక్కన కమలంతో కారు పార్టీ విలీనం అయిపోయిందనే వార్తలు.. మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి మరో వెర్షన్ కూడా లేకపోలేదు. కవితకు బెయిల్ రాని పక్షంలో హస్తినలో ఎమ్మెల్యేలతో ధర్నాకు దిగాలనే ఆలోచన చేస్తున్నట్లు అందులోని సారాంశం. ఇంతకీ ఏ విషయంలో ధర్నాకు కూర్చుంటారు? మరికొందరు మాత్రం రాష్ట్రపతిని కలిసే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఢిల్లీకి వెళ్తున్నారన్న వార్త తెలంగాణ బీజేపీ నేతల చెవిలో పడింది. జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీకి చెందిన నేతలు గమనిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎవరైనా మాట్లాడితే రియాక్ట్ అవ్వాలని ఆలోచన చేస్తున్నారట.
కేటీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత పార్టీని కలిపే వ్యవహారం ఓ కొలిక్కి రావడం ఖాయమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒకవేళ అంతా అనుకున్నట్లుగా జరిగితే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎంపిక ఆ పార్టీ హైకమాండ్కు సునాయాశమవుతుందని అంటున్నారు. మంగళవారం ఉదయంలోపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తిన టూర్పై ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.