KTR: సెస్ ఎన్నికల్లో బండి సంజయ్ 5 కోట్లు పంచారని.. అభ్యర్థులు ఆగమై తనకు ఫోన్లు చేశారని.. డబ్బులు పంచినోళ్లే మళ్లీ బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సెస్ ఎన్నికల్లో గెలవని వాళ్లు రాష్ట్రంలో గెలుస్తారా? అని ప్రశ్నించారు. సెస్ ఎన్నిక జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. 2023లో అసలు సినిమా చూపిస్తామంటూ సవాల్ చేశారు కేటీఆర్. గుజరాత్ పైసలు ఎన్ని వచ్చినా.. కేసీఆర్నే ముఖ్యమంత్రిని చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా దిశానిర్దేశం చేసిందన్నారు.
ప్రధాని మోడీ ఎవరికి దేవుడని బండి సంజయ్ ని కేటీఆర్ ప్రశ్నించారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచినోడు, నల్లచట్టాలు తెచ్చి రైతులను చంపినోడు.. చేనేత మీద పన్నువేసినోడు దేవుడా? అంటూ నిలదీశారు. గుజరాత్ నాయకుల చెప్పులు మోయడమే మీ పని అని.. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్కు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ కు ట్రిపుల్ ఐటీ, నవోదయ పాఠశాలలు తీసుకువచ్చావా? వేములవాడ ఆలయానికి 10 రూపాయలు చందా అయినా రాయించావా? అంటూ మండిపడ్డారు. సిరిసిల్ల నుంచి విజయయాత్ర ప్రారంభించి.. ఈ సారి కరీంనగర్ పార్లమెంట్పై గులాబీ జెండా ఎగురవేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణకు కేంద్ర నిధుల విషయంలో కిషన్ రెడ్డితో చర్చకు సిద్ధమన్నారు కేటీఆర్. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.1.68 లక్షల కోట్లు వెళ్లాయని, కేంద్రం తెలంగాణకు రూ.2 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు కన్నా మోడీ 100 రెట్లు ఎక్కువ చేసినా రాష్ట్రానికి మాత్రం మొండి చేయి చూపారని విమర్శించారు. దేశంలో 20 అత్యుత్తమ గ్రామ పంచాయితీల్లో 19 తెలంగాణలో ఉన్నాయన్న కేటీఆర్.. అయినా బీజేపీ నేతలు రాష్ట్రాభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. కిషన్రెడ్డి కరోనా సమయంలో కుర్కురే ప్యాకెట్లు పంచారని విమర్శించారు కేటీఆర్.