కూల్చడం పక్కా!
– రాష్ట్రంలో పాలనే లేదు
– ఇంకా ప్రజా పాలనా దినోత్సవం ఏంటి?
– ముమ్మాటికీ రాజీవ్ విగ్రహం తొలగించి తీరుతాం
– అధికారంలోకి రాగానే గాంధీ భవన్కు పంపుతాం
– పాలన పక్కనపెట్టి మమ్మల్ని దూషించడమే మీ పానా?
– కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్
– తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు
KTR: కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో తెలంగాణ భవన్ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ తల్లి కొలువుదీరాల్సిన చోట ప్రతిష్టించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి గాంధీ భవన్కు పంపుతామని స్పష్టం చేశారు. చేతనైతే మీరు ఇచ్చిన 420 అడ్డగోలు హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు. తమ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారని, వాళ్లు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. రేవంత్ చేసిన తప్పునకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేస్తామంటే అడ్డుకుంటారా అంటూ ఫైరయ్యారు. పోలీసులు అత్యుత్సాహాన్ని మానుకుని, అరెస్టు చేసిన తమ విద్యార్థి నేతలను వెంటనే విడుదల చేయాలన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేసిందని, జనం విష జ్వరాలు, డెంగ్యూతో బాధపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి ఉందన్న ఆయన, మొత్తం పాలన పక్కన పెట్టి కేసీఆర్, బీఆర్ఎస్ను దూషించటమే పనిగా పెట్టుకున్నారని హస్తం నేతలపై మండిపడ్డారు. సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తర్వాత అన్నీ మరించిపోయారని విమర్శించారు. 9 నెలలు అయిపోయినా ఉద్యోగాల ప్రస్తావన లేదన్నారు. రాష్ట్రంలో పాలనే లేనప్పుడు ప్రజా పాలనా దినోత్సవం ఎలా జరుపుతారని ప్రశ్నించారు. పోలీసుల వాహనాల్లో డీజిల్ కొట్టించేందుకు కూడా నిధులు ఇవ్వడం లేదన్న కేటీఆర్, 14 రోజుల్లో వర్షాకాలం ముగుస్తోందని చెప్పారు. ఇంకా రైతు భరోసా ఇవ్వలేదని, ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Jagan: ఒక్క ‘సాక్షి’కే రూ.300 కోట్లా? అంటే ఐదేళ్లలో..? అయ్య బాబోయ్, జగన్ మామూలోడు కాదు!
సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, ఇందుకు నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల సాఫీగా సాగిన కార్యక్రమాలు, కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారితీశాయి. పోలీసులు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని పార్టీ ఆఫీస్లో తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పాలాభిషేకం చేశారు.