KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్లపై ఒకేసారి మాటల దాడి చేశారు మంత్రి కేటీఆర్. పంచ్ డైలాగులు, పవర్ఫుల్ కామెంట్లతో భూపాలపల్లి వేదికగా కాక రేపారు. కేటీఆర్ స్పీచ్లో ఈసారి స్పైసీనెస్ బాగా పెరిగింది. ఎన్నికల ప్రచార సభలా సాగింది కేటీఆర్ మాటల దాడి.
ఓ పిచ్చోడు ప్రగతి భవన్ పేల్చేస్తామంటాడు.. మరో పిచ్చోడు సెక్రటేరియట్ను పేల్చేస్తామంటాడు.. అలాంటి పిచ్చోళ్ల చేతుల్లో పార్టీలు ఉంటే నష్టమే.. పచ్చగా ఉన్న తెలంగాణను పిచ్చోళ్ల చేతుల్లో పెట్టద్దు.. అన్నారు కేటీఆర్. తాము మాత్రం ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వండని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు.. 70 ఏళ్లలో ఒక్కటి కాదు.. 10 ఛాన్సులు ఇస్తే ఏం చేశారో చెప్పండంటూ నిలదీశారు. తెలంగాణ రాష్ట్రమే రాకపోతే తెలంగాణ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ అనేవి ఉంటుండేవా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికపై రేవంత్రెడ్డి చేస్తున్న విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క సంస్థను కూడా ఇవ్వలేదని.. తెలంగాణపై మోదీ సర్కార్ వివక్ష చూపిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. అసమర్థ ప్రధానిని.. బలవంతంగా విశ్వగురువు అంటున్నారని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ది కుటుంబ పాలన అని కొంతమంది విపక్ష నేతలు అంటున్నారు.. అవును, ముమ్మాటికీ మాది కుటుంబ పాలనే. రాష్ట్రంలోని 4కోట్ల మంది కేసీఆర్ కుటుంబమే.. మనది కుల పిచ్చి, మత పిచ్చి లేని వసుదైక కుటుంబం.. అని కేటీఆర్ అన్నారు.