KTR: ప్రధాని మోడీ ప్రసంగంపై బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. తొమ్మిదేళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగితను సృష్టించిన విఫల ప్రధాని మోడీ అని అన్నారు. ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోమన్న ప్రధాని.. యువత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా యూనివర్సిటీ ఖాళీల భర్తీని అడ్డుకుంటున్న తెలంగాణ గవర్నర్ కు.. ప్రధాని ఒక మాట చెబితే బాగుండేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 15 వేల మంది స్ధానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా ప్రధాని మాట్లాడలేదన్నారు.
గుజరాత్ లో 20 వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన ప్రధాని, 520 కోట్లతో కాజీపేటలో రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని అన్నారు కేటీఆర్.