KTR Comments on Bathukamma Sarees: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లో మళ్లీ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందంటూ ఆయన మండిపడ్డారు. తాజాగా సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించారు.
Also Read: కీలక వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి… స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక తప్పదా?
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యలు కొనసాగాయని, అయితే, రాష్ట్రం విడిపోయిన తరువాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినంక నేతన్నలను కాపాడుకోగలిగామన్నారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నేతన్నలను పట్టించుకోవడంలేదన్నారు. తమ హయాంలో నేతన్నలు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పారు. సిరిసిల్ల నేతన్నలకు రూ. 3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చామన్నారు. అంతేకాదు వారికి మేలు చేసే విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టినట్లు కేటీఆర్ చెప్పారు. దీంతో నేతన్నల ఆత్మహత్యలు తగ్గించగలిగామన్నారు.
‘ప్రజలకు కేసీఆర్ కిట్లు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకను మా హయంలో అందజేశాం. నేతన్నలతో చీరలు నేయించి దసరాకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశాం. సిరిసిల్లను మరో తిరుప్పూరు చేసేందుకు ఎంతగానో కృషి చేశాం. కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేసింది. బతుకమ్మ చీరల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దీనిపై విచారణ చేపట్టాలంటూ అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశాం. సిరిసిల్ల నేతన్నల తరఫున పోరాటం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మా పోరాటానికి నేతన్నలు కూడా సహకరించేందుకు రెడీ అవుతున్నారు’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: తెలంగాణ సెక్రటేరియేట్ నిర్మాణం.. విజిలెన్స్ విచారణ, వామ్మో.. అన్ని కోట్ల అవినీతా?
ఇదిలా ఉంటే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినంక బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. ప్రతి దసరా పండుగకు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుత సర్కారు దసరా పండుగకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నదా లేదా అంటూ రాష్ట్రంలో చర్చ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి పలు వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. బతుకమ్మ చీరల పంపిణీకి బదులు నేరుగా మహిళల అకౌంట్లోకి డబ్బులు పంపిణీ చేయాలనే యోచనలో ఉన్నదని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నదంటూ ఆ కథనాల్లో పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ బతుకమ్మ చీరలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ ఆర్డర్లను రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందంటూ ఆయన పేర్కొనడంతో సంచలనంగా మారింది.