– తెలంగాణ కాంగ్రెస్ నేతలకు డైరెక్ట్గానే లింక్ ఉన్నా కాపాడుతున్నదెవరు?
– కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకే హైడ్రా డ్రామాలు
– హస్తం నేతలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
– రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్
Valmiki Scam: కర్ణాటకను వాల్మీకి ఆదివాసీ అభివృద్ధి కార్పొరేషన్ స్కాం కుదిపేస్తోంది. అకౌంట్స్ సూరింటెండెంట్ సూసైడ్తో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఈ స్కాం నేపథ్యంలో మంత్రిగా ఉన్న నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ స్కాంలో లింక్స్ ఉన్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు చేశారు. వాల్మీకి స్కాంపై ఆయన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. వాల్మీకి కార్పొరేషన్లో 187 కోట్ల రూపాలయల నిధులు దుర్వినియోగం అయ్యాయని అన్నారు. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందన్న కేటీఆర్, హైదరాబాద్లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు కార్పొరేషన్ డబ్బు రూ.45 కోట్లు బదిలీ అయ్యాయని ఆరోపించారు. అవి ఎవరి అకౌంట్లని ప్రశ్నించారు. ఓ ఛానల్ యజమానికి రూ.4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు.
Also Read: CM Revanth Reddy: మిత్రులకు ఫాంహౌస్లు ఉన్నా కూల్చివేతలే..సీఎం రేవంత్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్లో నగదు విత్డ్రా చేయబడిన బార్లు, బంగారు దుకాణాలు ఎవరివని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతో వారికి ఉన్న సంబంధం ఏంటని అడిగారు. ఈ స్కాంలో హైదరాబాద్కు లింకులు కనపడుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఎవరు కాపాడుతున్నారని ప్రశ్నించారు కేటీఆర్. రాహుల్ గాంధీ ఈ స్కాం గురించి నోరు విప్పాలని డిమాండ్ చేశారు. నేరుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ స్కాంతో సంబంధం ఉందన్నారు. దాన్ని బయటకు రాకుండా మీడియాలో చూపించకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పైగా, ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్.