KTR: కేటీఆర్ కు చిరాకు వచ్చినట్టుంది. రోజూ డ్రగ్స్ ఆరోపణలు వస్తుండటంతో.. ఈసారి ఫుల్ సీరియస్ అయ్యారు. డ్రగ్స్ టెస్టు కోసం తన రక్తం, కిడ్నీ, చర్మం, గోర్లు, బొచ్చు ఏది కావాలంటే అది ఇస్తా.. ఇక్కడే ఉంటా, డాక్టర్లను తీసుకురా.. క్లీన్ చిట్ వస్తే కరీంనగర్ చౌరస్తాలో బండి సంజయ్ తన చెప్పుతో తానే కొట్టుకుంటాడా? అంటూ సవాల్ చేశారు కేటీఆర్.
పనికొచ్చే మాటలు చెప్పకుండా బండి సంజయ్ పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతున్నాడని.. మనిషా? పశువా? అని మండిపడ్డారు. ప్రజల కోసం ఏం చేశారో చెప్పకుండా.. కరీంనగర్ కోసం ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పకుండా.. అక్కరకురాని మాటలన్నీ మాట్లాడుతున్నాడని బండి సంజయ్ పై కేటీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
కొంతకాలంగా టీఆర్ఎస్ నేతలపై బండి సంజయ్ పదే పదే డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారు. నేరుగా కేటీఆరే డ్రగ్స్ తీసుకున్నారంటూ కామెంట్లు చేశారు. ఓ హీరోయిన్.. గోవా రిసార్ట్ అంటూ గోలగోల చేశారు. కేటీఆర్ కోర్టుకు వెళ్లి మరీ తనపై డ్రగ్స్ ఆరోపణలు చేయొద్దని ఉత్తర్వులు తెచ్చుకోవడంతో ఆ విమర్శలు ఆపేశారు. ఆ తర్వాత కేటీఆర్ ను వదిలి కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై డ్రగ్స్ బురద జల్లుతున్నారు బండి సంజయ్.
కర్నాటక డ్రగ్స్ కేసు అంటూ.. చాలామంది టీఆర్ఎస్ ప్రముఖులకు సంబంధం ఉందంటూ.. వాళ్లందరిపై కేసులు తప్పవంటూ తరుచూ హెచ్చరిస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ.. కర్నాటక డ్రగ్స్ కేసును రీఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ వెంటనే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడం.. బండి సంజయ్ కు ఈడీ నోటీసుల విషయం ముందే ఎలా తెలుసని.. ఇదంతా రాజకీయ కుట్ర అంటూ టీఆర్ఎస్ ఎదురుదాడి చేయడంతో తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది.
డ్రగ్స్ టాపిక్.. పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారడంతో.. కేటీఆర్ కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. గతంలో తనపై.. ఇప్పుడు తన ఎమ్మెల్యేలపై బండి సంజయ్ డ్రగ్స్ ఆరోపణలు చేస్తుండటం.. నిప్పు లేనిదే పొగ వస్తుందా.. నిజమే కావొచ్చనే చర్చ జరుగుతుండటంతో కేటీఆర్ కు కోపం వచ్చినట్టుంది. అందుకే, ఆయన భాషకు భిన్నంగా.. బొచ్చు..చెప్పు.. తరహా మాటలతో మంట రాజేశారని అంటున్నారు.